బెంగళూరుకు బొనాంజా.. చిన్నస్వామి స్టేడియంలోనే మ్యాచ్ లు!
అదే జరిగితే డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీకి షాక్ అయ్యేది. కానీ, పరిస్థితి సద్దుమణిగింది. కర్ణాటక ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణకు అడ్డు తొలగింది.;
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఫ్రాంచైజీలకు ఉండే అతిపెద్ద బెనిఫిట్.. తమ తమ సొంత మైదానాల్లో మ్యాచ్ లు ఆడడం. అలవాటైన మైదానంలో, స్థానిక అభిమానుల మధ్య మ్యాచ్ ఆడడం అంటే ఎంతైనా సానుకూలమే. అయితే, డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఈ విషయంలో మొన్నటివరకు ఒకటే బెంగ. నిరుడు టైటిల్ కొట్టాక జరిగిన విజయోత్సవంలో తొక్కిసలాట చోటుచేసుకుని 11 మంది చనిపోవడం పెద్ద దుమారమే రేపింది. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ ఉండదనే వరకు వెళ్లింది. అదే జరిగితే డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీకి షాక్ అయ్యేది. కానీ, పరిస్థితి సద్దుమణిగింది. కర్ణాటక ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణకు అడ్డు తొలగింది.
మొత్తం ఐదు మ్యాచ్ లు..
చిన్నస్వామి స్టేడియంతో బెంగళూరు జట్టుకు సహజంగానే అనుబంధం ఉంది. లీగ్ లో అత్యంత ఆదరణ ఉన్న జట్లలో బెంగళూరు ఒకటి. ఈ కోణంలో చూసినా ఆర్సీబీ మ్యాచ్ లు చిన్నస్వామి స్టేడియంలో జరగకుంటే అది పెద్ద సంచలనమే అయ్యేది. ఈ నెల 28 నుంచి ఐపీఎల్ మొదలవనుండగా, చిన్నస్వామిలో మ్యాచ్ ల ఆతిథ్యానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతిచ్చింది. భద్రతా ఏర్పాట్లపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికతో చర్చించి నిర్ణయం వెల్లడించింది. చిన్నస్వామిలో ఆర్సీబీ ఐదు మ్యాచ్ లు ఆడనుంది. ఈ ఫ్రాంచైజీకి రెండో హోం గ్రౌండ్ అయిన రాయ్ పూర్ స్టేడియంలో మరో రెండు మ్యాచ్ లు ఆడుతుంది.
ప్లే ఆఫ్, ఫైనల్ కూడా
చిన్నస్వామి స్టేడియానికి మరో గుడ్ న్యూస్ ఏమంటే.. ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్ లలో ఒకటి, ఫైనల్ కూడా ఇక్కడే నిర్వహించనున్నట్లు కథనాలు వస్తుండడం. వాస్తవానికి, లీగ్ లో మంచి రసవత్తరమైన మ్యాచ్ లు జరిగే వేదికల్లో చిన్నస్వామి ఒకటి. అలాంటి స్టేడియంపై ఆంక్షలు విధిస్తే అది లీగ్ ఆకర్షణపై ప్రభావం చూపేది. అదేమీ జరగకుండానే సుఖాంతం అయింది. కానీ, 35 వేల మందికి మించకుండా ప్రేక్షకులను మాత్రమే అనుమతించనున్నారు. మ్యాచ్ కు 4 గంటల ముందే స్టేడియం గేట్లను తెరిచేందుకు నిర్ణయించాయిరు. మహిళలు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నారు.