ఆర్సీబీ హవా మామూలుగా లేదుగా.. ఐపీఎల్ 2026లో టాప్ 4 మ్యాచ్‌లు ఇవే!

ఐపీఎల్‌లో ట్రోఫీలు గెలవడం ఒక ఎత్తైతే.. అభిమానుల మనసులు గెలుచుకుని ఒక రేంజ్ క్రేజ్ సంపాదించడం మరో ఎత్తు.

Update: 2026-06-09 15:30 GMT

ఐపీఎల్‌లో ట్రోఫీలు గెలవడం ఒక ఎత్తైతే.. అభిమానుల మనసులు గెలుచుకుని ఒక రేంజ్ క్రేజ్ సంపాదించడం మరో ఎత్తు. ఆ విషయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు సాటి వచ్చేది ఏదీ లేదు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీ ఆడిన మ్యాచ్‌లకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో వ్యూయర్షిప్ రికార్డులు బద్దలైపోయాయి. అత్యధిక మంది వీక్షించిన టాప్ 4 మ్యాచ్‌లు కూడా ఆర్సీబీవే కావడం విశేషం. ఆ వ్యూయర్షిప్ రికార్డుల విశేషాలు ఇప్పుడు చూద్దాం.

ఫైనల్ మ్యాచ్‌తో హిస్టరీ క్రియేట్:

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఈ తుది పోరును మొబైల్స్, ల్యాప్‌టాప్స్‌లో ఏకంగా 52 నుంచి 55 కోట్ల మంది వీక్షించినట్లు ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ 'క్రిక్‌ట్రాకర్' వెల్లడించింది. ఒక ఐపీఎల్ మ్యాచ్‌కు ఈ స్థాయిలో వ్యూస్ రావడం ఇదే మొదటిసారి.

లీగ్ దశలోనూ RCB దూసుకెళ్లింది:

ఫైనల్ మాత్రమే కాదు, లీగ్ మ్యాచ్‌ల్లో కూడా ఆర్సీబీ రికార్డులు సృష్టించింది. ఎక్కువ మంది చూసిన లిస్ట్‌లో రెండో స్థానంలో ఆర్సీబీ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్‌ను 42.6 కోట్ల నుంచి 43.4 కోట్ల మంది చూశారు. ఇక ఆ తర్వాత స్థానాల్లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ (41Cr - 41.3Cr), ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ (40.6Cr - 41Cr) నిలిచాయి. ఇలా టాప్ 4 ప్లేస్‌లు ఆర్సీబీవే కావడం విశేషం.

జియోహాట్‌స్టార్‌లో సగం మ్యాచ్‌లు ఆర్సీబీవే:

డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ లో ఈ సీజన్‌లో 300 మిలియన్లు (30 కోట్లు) పైగా వ్యూస్ సాధించిన 12 మ్యాచ్‌లు ఉంటే.. అందులో సగానికి పైగా మ్యాచ్‌లు ఆర్సీబీ ఆడినవే కావడం గమనార్హం. అలాగే ఐపీఎల్ చరిత్రలోనే 400 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన 4 మ్యాచ్‌లు కూడా ఆర్సీబీ ఖాతాలోనే పడ్డాయి. ఇక విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విన్యాసాలు, ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ వల్లే డిజిటల్ స్క్రీన్స్ ఈ రేంజ్‌లో షేక్ అయ్యాయి.

కప్పు కొట్టినా కొట్టకపోయినా సోషల్ మీడియాలో, వ్యూయర్షిప్‌లో ఎప్పుడూ నంబర్ వన్ ఆర్సీబీనే అని ఐపీఎల్ 2026 రికార్డులు మరోసారి ప్రూవ్ చేశాయి. గుజరాత్, రాజస్థాన్ మధ్య జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్ (36.6 కోట్లు) ఐదో స్థానానికి పరిమితం కాగా.. టాప్ 4లో కేవలం ఆర్సీబీ మ్యాచ్‌లే ఉండటం ఈ టీమ్ పవర్‌కు నిదర్శనం. 'ఈసాల కప్ నమ్దే' అనే స్లోగన్‌తో స్టేడియాలనే కాదు.. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను కూడా కిక్కిరిసిపోయేలా చేసిన ఆర్సీబీ ఫ్యాన్స్ క్రేజ్ నిజంగా అసాధారణం..

Tags:    

Similar News