వసీం అక్రంపై కాల్పులు...

Update: 2015-08-06 07:35 GMT
పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ప్రముఖ పేస్ బౌలర్ వసీం అక్రంపై గురువారం దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపాడు. కరాచీ జాతీయ స్టేడియంలో యువ బౌలర్లకు నిర్వహిస్తున్న శిబిరానికి వెళుతుండగా, అతని కారును వెనుక నుంచి వస్తున్న మరో కారు ఢీ కొంది. అక్రం ఆ కారు డ్రైవర్‌ను పిలుస్తూ వాహనాన్ని ఆపాల్సిందిగా సూచించాడు. అయితే, అతను ఆగకుండా వేగంగా వెళ్లడంతో, అక్రం అతనిని వెంబడించి మరీ తన కారును అడ్డంగా నిలిపాడు. అక్రం కారును ఢీకొన్న కారును నడుపుతున్న వ్యక్తి కిందకు దిగి వాదించడం మొదలు పెట్టాడు. అక్రం కూడా వాగ్వాదానికి దిగడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అదే సమయంలో ఆ వ్యక్తి తుపాకీ తీసి కారుపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్రం వైపు గురిపెట్టాడు. అదే సమయంలో అక్కడ ఉన్న వారు అక్రంను గుర్తించి, కాల్పులు జరిపిన వ్యక్తికి నచ్చచెప్పడంతో అతను కారు అద్దాలకు గురి చూసి మరోరౌండ్ పేల్చి వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై అక్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను లక్ష్యం చేసుకొని ఆ వ్యక్తి కాల్పులు జరిపాడని ఫిర్యాదుచేశాడు.

కాగా ఈ సంఘటన జరిగాక అక్రం మాట్టాడుతూ అదృష్టం బాగుండడంతో తాను బతికి బయటపడ్డానన్నాడు. తనతో ఘర్షణ పడిన వ్యక్తి కారు నంబర్ నోట్ చేసుకున్నానని, పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపాడు. తనను గుర్తుపట్టిన వారు చెప్పడంతో ఆ వ్యక్తి తనను కాల్చలేదని, లేకపోతే తన ప్రాణాలు పోయి ఉండేవని పేర్కొన్నాడు. తనపైనే ఈ విధంగా కాల్పులు జరిగితే, సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు. మొత్తానికి ఈ సంఘటనతో అక్రం బాగా హడలిపోయాడు.
Tags:    

Similar News