అభిషేక్ శర్మకు సీరియస్.. ఆస్పత్రికి తరలింపు.. అసలేమైంది?

టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోవాలని భావిస్తున్న తరుణంలో ఒక చేదు వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.;

Update: 2026-02-11 08:38 GMT

టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోవాలని భావిస్తున్న తరుణంలో ఒక చేదు వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. టీమిండియా యువ సెన్సేషన్, స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నమీబియాతో జరగనున్న తదుపరి మ్యాచ్‌కు ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం జట్టు మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న అభిషేక్ శర్మ, గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తొలుత సాధారణ కడుపు నొప్పిగా భావించినప్పటికీ సమస్య తీవ్రతరం కావడంతో ఢిల్లీలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైన జ్వరం, కడుపు ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనారోగ్యం కారణంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన జట్టు ప్రాక్టీస్ సెషన్‌కు అభిషేక్ హాజరు కాలేదు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన అనంతరం ఆయన ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. ఆయన స్థానంలో సంజూ శాంసన్ ఫీల్డింగ్ చేశారు.

టీమ్ అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ మీడియాతో మాట్లాడుతూ.. "అభిషేక్ ఇంకా కోలుకుంటున్నాడు. కడుపులో అసౌకర్యం తగ్గాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో అతను పూర్తిగా ఫిట్ అవుతాడని భావిస్తున్నాం. అయితే నమీబియాతో మ్యాచ్‌లో అతని భాగస్వామ్యంపై ఇంకా స్పష్టత లేదు" అని తెలిపారు. బీసీసీఐ వర్గాల ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలో జరగబోయే పాకిస్థాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్ సమయానికి అతను అందుబాటులోకి రావడమే ప్రస్తుత లక్ష్యంగా కనిపిస్తోంది.

జట్టులోకి వాషింగ్టన్ సుందర్ పునరాగమనం

ఒకవైపు అభిషేక్ దూరం కావడం లోటుగా అనిపిస్తున్నా, మరోవైపు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుతో చేరడం సానుకూల అంశం. గాయం నుంచి కోలుకున్న సుందర్ బుధవారం ఢిల్లీలో జట్టుతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నమీబియాతో మ్యాచ్‌లో అతను తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

బుమ్రా ఫిట్‌నెస్‌పై ఊరట

జ్వరంతో అమెరికా మ్యాచ్‌కు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్లు కోచ్ వెల్లడించారు. సుమారు 10 రోజుల విరామం తర్వాత బుమ్రా మళ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించడం భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపింది.

ఒకవేళ నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్ అందుబాటులో లేకపోతే ఓపెనర్‌గా సంజూ శాంసన్ ను ప్రమోట్ చేసే అవకాశం ఉంది. నమీబియాతో మ్యాచ్ ఫిబ్రవరి 12న ఢిల్లీలో జరగనుంది. ఆ లోపు అభిషేక్ డిశ్చార్జ్ అయ్యి జట్టులో చేరతారో లేదో చూడాలి.

Tags:    

Similar News