అతడ్ని యాకూబ్ మెమన్ క్షమిస్తానన్నాడట

Update: 2015-08-04 04:38 GMT
257 మంది మరణానికి కారణమై.. దాదాపు 713 మందికి పైగా గాయాలకు కారణమైన ఒక కిరాతక హంతకుడు.. తనను చంపే వ్యక్తిని క్షమిస్తాడా? ఛాన్స్ లేదని అనుకోవచ్చు. కానీ.. గత వారం ఉరిశిక్ష పడిన యాకూబ్ మెమన్ మాత్రం ఆ మాటే చెప్పాడట.

సుదీర్ఘకాలం జైలు జీవితంలో ఉండటమో.. పరివర్తనో కానీ.. తనను ఉరి తీసే తలారీని క్షమిస్తానని చెప్పాడట. 1993లో ముంబయిలో చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడై.. ఉరిశిక్ష అమలైన దోషి యాకూబ్ మెమన్ తనను ఉరి తీసే తలారిని క్షమిస్తానని చెప్పినట్లుగా చెబుతున్నారు.

తనను ఉరి తీసే వ్యక్తితో నాగపూర్ జైల్లో మాట్లాడిన యాకూబ్ మెమన్.. అతడు తన డ్యూటీని నిర్వహిస్తున్నాడని.. అందుకే అతన్ని తాను క్షమిస్తానని చెప్పినట్లుగా తెలిసింది. బాంబు పేలుళ్లకు సంబంధించి తన పాత్ర ఏమిటన్నది తనకు.. ఆ పై భగవంతుడికి మాత్రమే తెలుసని వ్యాఖ్యానించిన కిరాతకుడి నోటి నుంచి.. ఇలాంటి మాటలు రావటం గమనార్హం.
Tags:    

Similar News