బీజేపీలోకి రాములమ్మ ... స్పష్టం చేసిన ఉత్తమ్ !

Update: 2020-10-31 10:10 GMT
తెలంగాణ కాంగ్రెస్ లో రాములమ్మకి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కాంగ్రెస్ కి ఉన్న స్టార్ క్యాంపెనర్ విజయశాంతి మాత్రమే. ఎన్నికలు ఎక్కడ ఉన్నా , సమయం ఏదైనా కూడా రాములమ్మ అక్కడ ప్రత్యక్షం అయ్యేది. ప్రత్యర్థులపై పదునైన విమర్శలు కురిపించేది.  2018 ఎన్నికల సమయంలో కావచ్చు,2019 ఎన్నికల సమయంలో ఆమె సేవలు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన హెలికాఫ్టర్ కేటాయించి మరి ఎన్నికల ప్రచారం చేయించారు. అయితే , ఆమె చేసిన ప్రచార సభలు అన్ని కూడా సక్సెస్ అయ్యాయి , కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ మాత్రం సక్సెస్ కాలేకపోయింది.  ఇక 2018 లో జరిగిన ఎన్నికల్లో ఆమెకి కనీసం ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు. అయితే , ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కి పరాభవం ఎదురైంది. ఆ తర్వాత రాములమ్మ పార్టీ కార్యక్రమాలకి కొంచెం దూరంగా ఉంటూ వస్తుంది. అయితే , అప్పుడప్పుడు సీఎం కేసీఆర్ పై, టిఆర్ ఎస్ ప్రభుత్వం పై విమర్శలు , ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

ఇకపోతే , ఈ మద్యే  కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, విజయశాంతిని హైదరాబాద్ ‌లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ ఇద్దరు మాట్లాడుకోగా.. కాషాయ కండువాను కప్పుకునేందుకు ఆమెకు లైన్ క్లియర్ అయినట్లు విపరీతంగా వార్తలు వైరల్ అయ్యాయి. దీనితో విజయశాంతి బీజేపీలోకి చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వేళ ఆమెని బీజేపీలో చేరకుండా, కాంగ్రెస్ లోనే కొనసాగేలా చేయడానికి టీపీసీసీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , విజయశాంతి తో మాట్లాడానని ,కేవలం కరోనా మహమ్మారి కారణంగానే విజయశాంతి ప్రచారానికి దూరంగా ఉన్నారని, ఆమె బీజేపీ లో చేరబోతున్నారని వచ్చే వార్తల్లో ఎటువంటి నిజం లేదని అన్నారు.

ఇకపోతే, విజయశాంతి 1998లో బీజేపీలో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంతేకాదు బీజేపీ విమెన్స్‌ వింగ్‌  సెక్రటరీ గా కూడా పనిచేశారు. అయితే ఆ తరువాత బీజేపీ నుంచి బయటకు వచ్చిన విజయశాంతి.. 2009లో తల్లి తెలంగాణ అని సొంత పార్టీని స్థాపించారు. తరువాత దాన్ని టీఆర్ ‌ఎస్ ‌లో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ ఎస్‌ తరఫున 2009 ఎన్నికల్లో ఎంపీగా కూడా విజయం సాధించారు. ఆ తరువాత టీఆర్‌ ఎస్ ‌లో విబేధాలు రావడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి.. 2014లో కాంగ్రెస్‌ లో చేరారు. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో మెదక్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ లోనే కొనసాగుతుంది. మళ్లి తాజాగా ఆమె బీజేపీలో చేరబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. చూడాలి రాములమ్మ మనసులో ఏముందో...
Tags:    

Similar News