వెంకయ్య నాయుడికి ట్విట్టర్ బిగ్ షాక్ .. ఏంజరిగిందంటే ?

Update: 2021-06-05 12:30 GMT
గతకొన్ని రోజులుగా వివాదాలకి కేరాఫ్ గా నిలుస్తూ వస్తున్నా ట్విట్టర్ , మరోమారు అదే తరహా వైఖరిని ప్రదర్శించింది. ఈ వివాదాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నిరూపించుకున్నట్టయింది. ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్‌ ను మొత్తానికే బ్లాక్ చేసిన ట్విట్టర్, అదే తరహా దూకుడును భారత్‌ లో ప్రదర్శిస్తోంది. ట్విట్టర్ ఖాతాలను వినియోగిస్తోన్న వారు హోదాలతో సంబంధం లేకుండా, బ్లూ బ్యాడ్జి వెరిఫికేషన్ విషయంలో నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తామనే విషయాన్ని ట్విట్టర్ యాజమాన్యం మరోసారి రుజువు చేసింది. తాజాగా ఉప రాష్ట్రపతి ముప్పవరకు వెంకయ్య నాయుడు వినియోగిస్తోన్న ఆయన వ్యక్తిగత అకౌంట్‌ కు సంబంధించిన బ్లూ టిక్‌ ను తొలగించింది. ఉప రాష్ట్రపతి హోదాలో ఆయన వాడుతోన్న అకౌంట్ బ్లూ బ్యాడ్జిని కొనసాగించింది.

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండు రకాల ట్విట్టర్ అకౌంట్లను వినియోగిస్తోన్నారు. ఒకటి ఉప రాష్ట్రపతి హోదాలో, మరొకటి వ్యక్తిగతంగా. ఈ రెండింట్లో @MVenkaiahNaidu అనే ఖాతా ఆయన వ్యక్తిగతానికి సంబంధించినది. ఏదైనా ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సమయంలో వాటికి సంబంధించిన సమాచారాన్ని, ఫొటోలను వెంకయ్యనాయుడు ఈ ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు. గత ఏడాది జులై 23వ తేదీన ఇందులో ఆయన చివరి పోస్ట్ చేశారు. ఆ తరువాత అప్‌ డేట్స్ ఏవీ అందులో కనిపించలేదు. బ్లూ టిక్ ఉన్న అకౌంట్ ఆ ఖాతాదారుడికి సంబంధించినదేనని ధృవీకరించడానికి ట్విట్టర్ యాజమాన్యం ఈ బ్లూ టిక్‌ ను వినియోగిస్తుంటుంది. అలాంటి ప్రాధాన్యత ఉన్న ఈ మార్క్‌ను తొలగించింది ట్విట్టర్ యాజమాన్యం. ఉప రాష్ట్రపతి స్థాయి నాయకుడే అయినప్పటికీ.. ఆ విషయాన్ని పట్టించుకోలేదు. తన వ్యక్తిగత అకౌంట్‌లో వెంకయ్య నాయుడు యాక్టివ్‌గా లేకపోవడం వల్లే బ్లూ బ్యాడ్జిని తొలగించి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

అదే సమయంలో ఉప రాష్ట్రపతి హోదాలో ఆయన వినియోగించే అధికారిక ఖాతాకు బ్లూ టిక్‌ ను కొనసాగించింది. ప్రభుత్వరంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా హౌస్‌ లు, జర్నలిస్టులు, ఎంటర్‌ టైన్‌ మెంట్ రంగానికి చెందిన సెలెబ్రిటీలు, క్రీడాకారులు ఇలా గుర్తింపు పొందిన సెక్టార్లలోని ప్రముఖుల అకౌంట్లను ట్విట్టర్ యాజమాన్యం ప్రస్తుతం వెరిఫై చేస్తోంది. ఈ క్రమంలో బ్లూ టిక్ ఉన్న ఖాతాదారులు తమ ట్విటర్ అకౌంట్‌ లో యాక్టివ్‌గా లేకపోతే మాత్రం, ఆ బ్యాడ్జ్‌ ను తొలగించేస్తోంది. ఈ విషయంలో ఎవరినీ మినహాయించట్లేదు. దాదాపు ఏడాది కాలంగా ఎలాంటి పోస్టులు లేకపోవడం వల్లే ట్విట్టర్ యాజమాన్యం వెంకయ్య నాయుడి వ్యక్తిగత అకౌంట్‌కు సంబంధించిన బ్లూ బ్యాడ్జిని తొలగించి ఉండొచ్చని అంటున్నారు. కాగా, ట్విట్టర్ చర్య పట్ల భారతీయ జనతాపార్టీ నాయకుడు, ముంబై విభాగం అధికార ప్రతినిధి సురేష్ నకువా అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు.


Tags:    

Similar News