టీఆర్ఎస్ ట్ర‌బుల్ షూట‌ర్ కేటీఆర్‌... క‌ల నిజం అవుద్దా?

Update: 2022-04-17 12:52 GMT
టీఆర్ఎస్ పార్టీలోని అంత‌ర్గ‌త స‌వాళ్ల‌కు, పార్టీ స‌మ‌స్య‌లు ఎదుర్కునే సంద‌ర్భంలో వాటిని డీల్ చేయ‌డం అంటే పార్టీ ర‌థ‌సార‌థి కేసీఆర్ త‌ర్వాత వినిపించే పేరు ఆయ‌న మేన‌ల్లుడు, మంత్రి హ‌రీశ్ రావు. అయితే, గ‌త కొద్దికాలంగా, అన‌ధికారికంగా, వ్యూహాత్మ‌కంగా హ‌రీశ్ రావును ప‌క్క‌న పెట్టేయ‌డం, పార్టీలో త‌న త‌ర్వాత త‌న‌యుడు తార‌క‌రామారావే అనే ముద్ర ప‌డేలా చేయ‌డంలో కేసీఆర్ స‌క్సెస్ అయ్యారు.

అయిన‌ప్ప‌టికీ, హుజురాబాద్ ఉప ఎన్నిక వంటి అత్యంత స‌వాలుతో కూడిన పోరు విష‌యంలో హ‌రీశ్ రావునే కేసీఆర్ న‌మ్ముకోవాల్సి వ‌చ్చింది. ట్ర‌బుల్ షూట‌ర్‌గా దింపాల్సి వ‌చ్చింది. అయితే, తాజాగా హ‌రీశ్ స్థానంలోకి కేటీఆర్‌ను ప్ర‌మోట్ చేసే ప‌నిలో గులాబీ ద‌ళ‌ప‌తి బిజీగా ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది.

గ‌త కొద్దికాలంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు త‌మ అసంతృప్తిని బ‌హిరంగంగానే వ్య‌క్తం చేయ‌డం లేదా పార్టీలు మార‌డం వంటివి చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇలాంటి వాటిల్లో ఉమ్మడి ఖ‌‌మ్మం జిల్లా ముఖ్యంగా పేర్కొన‌వ‌చ్చు. అనేక‌‌సార్లు పాత‌‌, కొత్త నేత‌‌ల మ‌‌ధ్య పంచాయ‌తీ పోలీస్స్టేషన్ల దాకా వెళ్లి ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారిపోయింది.

టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంక‌ట‌వీరయ్య, మెచ్చ నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి గెలిచిన వ‌న‌మా వెంక‌టేశ్వరరావు, రేగా కాంతారావు, కందాల ఉపేంద‌ర్ రెడ్డి, బానోతు హ‌రిప్రియా నాయ‌క్ త‌ర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో దాదాపు జిల్లా మొత్తం కొత్తగా పార్టీలో చేరిన వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన రేగా కాంతారావు భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడ‌య్యారు. గ‌తంలో టీఆర్ఎస్ లో కీల‌కంగా ప‌నిచేసిన  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ప్రస్తుతం ఏ ప‌ద‌వీ లేకుండా ఖాళీగా ఉంటున్నారు.

స్థూలంగా చెప్పాలంటే, ఖ‌మ్మం జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ పాత నేత‌లు, ప్రస్తుత ఎమ్మెల్యేల మ‌ధ్య పూడ్చలేనంత అగాథం ఉంది. పాత నేత‌ల్లో ఎక్కువమంది మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెంట‌నే ఉన్నారు. సీఎం కేసీఆర్ వ‌న‌ప‌ర్తి పర్యటన‌కు ఆహ్వానం అంద‌ని మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సీఎం మీటింగ్ కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే ఖ‌మ్మంలో ప్రత్యక్షమ‌య్యారు.

మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటితో మంత‌నాలు జ‌రిపారు. ఆ స‌మ‌యంలో పొంగులేటి వెంట డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజ‌య్ బాబు, స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే అభ్యర్థి పిడ‌మ‌ర్తి ర‌వి ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్  ముఖ్య నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య సఖ్యత కుదిర్చేందుకు లంచ్ మీటింగ్ ప్లాన్ చేశారు.

ఖమ్మం నగరంలో రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల కోసం కేటీఆర్ ఈ నెల 18న ఖమ్మం టూర్ పెట్టుకొని ఈ సందర్భంగా లంచ్ ను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేయడం గ‌మ‌నార్హం. ఈ లంచ్ మీటింగ్ సందర్భంగా తుమ్మల, పొంగులేటి, పువ్వాడ అజయ్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు కేటీఆర్ ప్లాన్ చేసినట్టుగా పార్టీ నేతలు చెప్తున్నారు.

ఇలా కేటీఆర్‌ను ట్ర‌బుల్ షూట‌ర్‌గా ప్లాన్ చేసే ఎత్తుగ‌డ‌లో పార్టీ పెద్ద‌లు ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఆదిలోనే హంసపాదు అన్న‌ట్లుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఆయన ఖమ్మం జిల్లాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ కామర్స్పై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ మీటింగ్తో పాటు తెలంగాణ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో రేపటి పర్యటనను మంత్రి రద్దు చేసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో కేటీఆర్ ఖమ్మం పర్యటనకు సంబంధించి కొత్త షెడ్యూల్ ప్రకటించనున్నట్లు సమాచారం.
Tags:    

Similar News