శ్రీవారి సేవలో తరించే డాలర్ శేషాద్రి విశాఖలో హఠాన్మరణం

Update: 2021-11-29 03:58 GMT
తిరుమల శ్రీవారిని క్షణం పాటు వీక్షించేందుకు కోట్లాది మంది పడే పాట్లు అన్ని ఇన్ని కావు. అలాంటిది గంటల తరబడి స్వామి వారి వద్దే ఉంటూ ఆయనకు సేవలు చేసుకునే మహాద్భాగ్యం చాలా చాలా కొద్దిమందికే దక్కుతుంది. అలా దక్కుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద దిక్కుగా.. ఆలయానికి సంబంధించిన కీలక విషయాల్లో ఆయన ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకోలేని రీతిలో వ్యవహరించే డాలర్ శేషాద్రి ఇక లేరు. ఈ తెల్లవారుజామున విశాఖలో ఆయన కన్నుమూశారు. తిరుమలలో ఉండాల్సిన ఆయన విశాఖకు ఎందుకు వచ్చారు? అన్న సందేహం కలుగక మానదు.

టీటీడీ ఆధ్వర్యంలో విశాఖలోని బీచ్ వద్ద కార్తీకమహాదీపోత్సవ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించ తలపెట్టారు. ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు ఆయన విశాఖకు వచ్చారు. ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున లేచి కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న వేళలో.. తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. ఆ వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూశారు. 75 ఏళ్ల డాలర్ శేషాద్రి ప్రస్తుతం టీటీడీదకి ఓఎస్డీగా వ్యవహరిస్తున్నారు. 1978లో శ్రీవారి సేవలో ఉంటున్న ఆయన 2007లో రిటైర్ అయ్యారు. అయితే.. శ్రీవారి సేవలకు సంబంధించిన అన్ని వివరాలు.. ఎప్పుడేం చేయాలన్న దానిపైఆయనకున్న పట్టు నేపథ్యంలో ఆయన్ను ప్రభుత్వం ఓఎస్డీగా నియమించింది.

ఈ కారణంతోనే పదవీవిరమణ చేసిన తర్వాత కూడా శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. వీవీఐపీ భక్తులు తిరుమలకు వచ్చినప్పుడు.. వారికి దర్శనంతో పాటు.. శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందిస్తూ.. వారి దర్శనం ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించటంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్న మాట వినిపిస్తూ ఉంటుండి. నిజానికి డాలర్ శేషాద్రి పూర్తి పేరు పాల శేషాద్రి. ఆయన మెడలో డాలర్ ధరించి ఉండడటంతో ఆయన పేరు డాలర్ శేషాద్రిగా పేరొందారు. ఆయనకు వ్యాపార ప్రముఖులే కాదు.. పెద్ద పెద్ద సెలబ్రిటీలతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి.అధికారంలో ఎవరున్నా వారిలో సత్ సంబంధాలు ఉండటంతో పాటు.. టీటీడీలో ఆయన స్థానం చెక్కుచెదరకుండా ఉండటం ఆయన ప్రత్యేకతగా చెప్పాలి.

ఆసక్తికరమైన విషయం ఏమంటే డాలర్ శేషాద్రి టీటీడీలో అర్చకత్వ ఉద్యోగికాదు. ఆడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఉద్యోగి. బ్రహ్మోత్సవాలు.. వసంతోత్సవాలు.. ఇతర కైంకర్యాలకు సంబంధించి ఎప్పుడు ఏం చేయాలన్న దానిపై మంచి పట్టు ఉండటంతో ఆయనకు ఆ సేవలకు ఉపయోగించుకునే వారు. పదవీ విరమణ తర్వాత కూడా ఆయన కొండపైనే ఉండేవారు. కుటుంబంతో కంటే కూడా శ్రీవారి ఆలయంలోనే ఆయన ఎక్కువకాలం గడిపేవారు.

శ్రీవేంకటేశ్వరస్వామి ఆభరణాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలిసిన ఏకైక వ్యక్తిగా ఆయనకు పేరుంది. శ్రీవారి బొక్కసాన్ని ఆయనే అనధికారికంగాచూస్తున్నారని చెబుతారు. మొఘల్ చక్రవర్తిఅక్బర్.. విక్టోరియా మహారాణి.. శ్రీక్రిష్ణదేవరాయులు ఇచ్చిన ఆభరణాల గురించి ఆయనకే బాగా తెలుసని చెబుతారు. డాలర్ శేషాద్రి హఠాన్మరణం టీటీడీకి తీరని నష్టమని ఈవో ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. సుదీర్ఘకాలం తిరుమల కొండ మీద ఉన్న ఆయన.. తన తుదిశ్వాస విడిచే వేళలో తిరుమలకు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖలో ఆయన ఉండట విధి వైచిత్రి కాక మరేంటి?
Tags:    

Similar News