కేసీఆర్ కాళేశ్వరం కలకు ఇదే కీలకం

Update: 2019-06-22 06:06 GMT
కేసీఆర్ అపరభగీరథుడిలా కాళేశ్వరం పూర్తి చేయించాడు. పట్టువదలకుండా మూడేళ్లలోనే తెలంగాణ ప్రజల కల సాకారం చేశాడు. అయితే ఇంత పెద్ద ప్లాన్ లో తెలంగాణ పచ్చబడాలంటే అదే కీలకం.. కేసీఆర్ కల నెరవేరాలంటే అది కరుణించాల్సిందే.. ఇంతకీ కాళేశ్వరానికే ప్రాణాధారమైన ప్రాణహిత నది సంగతులేమిటో తెలుసుకుందాం.

తెలంగాణకు  దక్షిణాన కృష్ణ .. ఉత్తరాన గోదావరి నదులున్నాయి. అయితే  కేసీఆర్ ఈ రెండు ప్రధాన నదులను లెక్కలోకి తీసుకోవడం లేదు. గోదావరి ఉపనది అయిన ప్రాణహితపైనే ప్రాణం పెట్టారు. ఆ నది గోదావరిలో కలిసే దిగువనే కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నారు. తెలంగాణ నీటి కష్టాలు తీర్చగల ప్రాణహిత నది గురించి చాలా తక్కువమందికి తెలుసు.. ఎందుకు ఈ నదినే కేసీఆర్ నమ్ముకున్నారు. దీన్ని ఆధారంగా చేసుకొని కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టు కడుతుండడం గమనార్హం.

ప్రాణహిత అనేది ఒక నది కాదు.. రెండు చిన్న ఉపనదులతో ఏర్పడ్డ పెద్ద ఉపనది.. పెన్ గంగా, వైన్ గంగా ఈ రెండు మహారాష్ట్ర, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల్లో  కలిసిపోయి ప్రాణహిత ఏర్పడుతుంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల గుండా ప్రాణహిత ప్రవహిస్తుంది. ప్రాణహితకు దక్షిణాన తెలంగాణ, ఉత్తరాన మహారాష్ట్ర ఉంటుంది. అందుకే ఈ అంతరాష్ట్ర నదిపై ఎక్కడా ప్రాజెక్టులు కట్టడానికి రెండు రాష్ట్రాలకు అవకాశం లేదు. రెండు రాష్ట్రాలను విడదీస్తున్న ప్రాణహితకు నీటి ప్రవాహం చాలా ఎక్కువ. ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్రలోని అభయారణ్యం తడోబాపై కురిసే అత్యధిక వర్షం అంతా ప్రాణహితలోకే వస్తుంది. అందుకే ఎండాకాలంలో సైతం నీరు ఇంకిపోని ప్రాణహితను కేసీఆర్ ఎంపిక చేసుకున్నారు. తెలంగాణ సాగు, తాగు నీటికష్టాలు తీర్చేందుకు కాళేశ్వరం కడుతున్నారు. ప్రకృతిసిద్ధంగా తెలంగాణకు వరప్రదాయిని అయిన ప్రాణహితే.. ఇప్పుడు తెలంగాణ ప్రజల ప్రాణదాత అనడంలో ఎలాంటి సందేహం లేదు.

గోదావరి నదిపైన మహారాష్ట్ర ఎన్నో ప్రాజెక్టులు కట్టింది. ఇక కృష్ణ నదిపై కర్ణాటక కట్టేసింది. ఇందులోకి ఒక్క చుక్క నీరు కిందకు రావడం లేదు.  అదే ప్రాణహిత నదిపై మాత్రం.. ఎక్కడా ఏ ప్రాజెక్టు కట్టడానికి వీలులేకుండా ప్రకృతి సిద్ధమైన వాతావరణం ఉంది. అదే కేసీఆర్ ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టడానికి దోహదపడింది..

    

Tags:    

Similar News