ఈ ఏడాది ఎండలు దంచికొట్టబోతున్నాయట .. ఐఎండీ నివేదిక

Update: 2021-03-05 00:30 GMT
వేసవి వస్తుంది అంటే అందరికి కొంచెం భయంగానే ఉంటుంది. వేసవి ఎలా ఉండాలి రా బాబు అంటూ ముందునుండే భయపడుతుంటారు. అలాగే మరికొందరు చల్లటి ప్రదేశాలకి టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. గత నాలుగు రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. గత కొన్ని రోజుల ముందు వరకూ చలిగాలులు, పొగమంచు దుప్పట్లు కప్పుకోగా.. ప్రస్తుతం భానుడి భగభగలు మొదలయ్యాయి. వచ్చే వేసవి ఎలా ఉండబోతుందో ప్రారంభానికి ముందే సంకేతాలు వెలువడుతున్నాయి.

తాజాగా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాలు దీనికి అనుగుణంగానే ఉన్నాయి. ఈ ఏడాది వేసవి కాలంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ఈ సంవత్సరం మార్చి నెల రాకముందే వాతావరణం వేడిగా మారింది. గత నాలుగు రోజులుగా చూస్తే వాతావరణంలో అనేక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భానుడి భగభగ లతో పట్టపగలు ఇప్పటి నుండే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఎండలు ఎలా ఉంటాయో మరి. రాబోయే వేసవి కాలంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉత్తర, వాయువ్య మరియు ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు, మధ్య భారతదేశంలోని తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. చత్తీస్ ఘడ్, ఒడిశా , గుజరాత్, మహారాష్ట్ర, గోవా ,తీరప్రాంత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో రాబోయే రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు కనిపించే అవకాశం ఉంది.

ఉత్తర భారతంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగానే ఉండొచ్చని అంచనా వేసింది. సింధూ-గంగా మైదానాలు పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, తూర్పు, పశ్చిమ యూపీ, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ నుంచి ఒడిశా వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని తెలిపింది. చత్తీస్‌గఢ్, ఒడిశాలో సాధారణం కంటే 75 శాతం, మిగతా చోట్ల 65 శాతం అధికంగా ఉంటాయని పేర్కొంది. భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ తీరంలో లా నినా పరిస్థితులు ఉన్నాయని, మధ్య, తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. లానినా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తాజా మోడల్ సూచిస్తోంది అని వివరించింది.పసిఫిక్ తీర ప్రాంతంలో చల్లటి వాతావరణానికి లానినాతో సంబంధం ఉంది. ఎల్ నినో దాని సంశ్లేషణ. ఈ దృగ్విషయం భారత ఉపఖండంలోని వాతావరణంపై ప్రభావం చూపుతుంది. ఏప్రిల్‌-జూన్‌కి సంబంధించిన వేసవి అంచనాలను ఏప్రిల్‌లో విడుదల చేస్తామని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర పేర్కొన్నారు. ఏదేమైనా ఈ ఏడాది భానుడి భగభగలు తట్టుకోవడం కొంచెం కష్టమే కాబట్టి ఇప్పటి నుండే తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
Tags:    

Similar News