భారత్ లో రూ.200 కోట్లు దాచుకున్న ఎన్నారై.. ఏమైందంటే?

Update: 2021-10-20 23:30 GMT
అమెరికాలో కోట్లు సంపాదించిన ఓ ఎన్నారై ఆ డబ్బును ఏం చేయాలో తెలియక భారత్ లోని ఓ బ్యాంకులో దాచుకున్నాడు. తన అకౌంట్లో భద్రంగా ఉంచుకున్నాడు. ట్విస్ట్ ఏంటంటే అతడికి చివరకు షాక్ తగిలింది.

అమెరికాలో ఉంటున్న ఎన్నారై భారత్ లోని హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకులో రూ.200 కోట్లు దాచుకున్నారు. అయితే చాలాకాలంగా ఈ అకౌంట్ తో ఎటువంటి లావాదేవీలు జరపలేదు. దీంతో నేరగాళ్లు కళ్లు ఆ అకౌంట్ పై పడ్డాయి. చివరకు ఆ బ్యాంకులోని ఉద్యోగులను ఈ కుట్రలో భాగం చేసుకున్నారు. వారి సాయంతో నొక్కేద్దామనుకున్నారు. చివరకు పోలీసుల చేతికి చిక్కారు.

దేశ రాజధాని న్యూఢిల్లీలో వెలుగుచూసిన ఈ ఘటన ప్రస్తుతం పెను కలకలాన్ని సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. వీరికి సహకరించిన ముగ్గురు హెచ్.డీఎఫ్.సీ బ్యాంకు ఉద్యోగులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఈ కుట్ర వెనుకున్న ప్రధాన నిందితుడు.. బ్యాంకు ఉద్యోగుల సాయంతో ఎన్నారై అకౌంట్ కు సంబంధించి కేవైసీ వివరాలను మార్చేశాడు. సదురు ఎన్నారై తన అకౌంట్ ఓపెన్ చేసిన సందర్భంగా పేర్కొన్న ఫోన్ నంబర్ ను పోలిన మరో నెంబర్ భారత్ లో తీసుకొని ఆ అకౌంట్ కు జత చేశాడు. ఆ తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు బదిలీ చేసేందుకు ప్రయత్నించారు.

ఒకటి కాదు... రెండు కాదు ఇలా 66 సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ విభాగం పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేసి విచారణ ప్రారంభించారు. యూపీ, హర్యానా, ఢిల్లీ మొత్తం 20 ప్రాంతాల్లో తనిఖీలు జరిపి నిందితులను అరెస్ట్ చేశారు.



Tags:    

Similar News