చంద్రబాబు చాంపియన్ అంటూ షాకిచ్చిన సంచైత గజపతిరాజు

Update: 2020-08-12 06:15 GMT
వారసత్వంపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో మన్సాన్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్ సంచైత గజపతిరాజు టీడీపీ అధినేత చంద్రబాబు, తన బాబాయి అశోక్ గజపతి రాజులపై మళ్లీ విమర్శలు గుప్పించారు. తండ్రి వాటాలో కూతురుకు హక్కులు ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొడుకుతో సమానంగా కూతురుకు ఆస్తిలో సమాన హక్కులు ఉంటాయన్న కోర్టు తీర్పును చంద్రబాబు కూడా స్వాగతించారు.

'ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కులు ఉండాలని నాలుగు దశాబ్దాల క్రిందటే ఎన్టీఆర్ ఆకాంక్షించి, అమలుచేశారు. రాజకీయాల్లోనూ, చట్టసభల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఆడపడుచుల ప్రాతినిధ్యానికి ప్రాముఖ్యతనిచ్చింది తెలుగుదేశమే. స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు మహిళాశక్తిని చాటింది కూడా తెలుగుదేశమే' అన్నారు. చంద్రబాబు స్పందనపై సంచైత కౌంటర్ ఇచ్చారు.

మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది టీడీపీనే అని గుర్తు చేసిన చంద్రబాబును చాంపియన్‌గా అభివర్ణించారు. అయితే ఆయన తాను చెప్పిన మాటలను అనుసరించి చూపాలని హితవు పలికారు. వారసత్వం విషయంలో అశోక్ గజపతిరాజు అదే పనిగా తనపై చేస్తోన్న విమర్శల దాడి ఆగేలా, హక్కుల గురించి మీరైనా ఆయనతో చెప్పాలన్నారు. అశోక్ గజపతిరాజు అన్నయ్య ఆనంద గజపతిరాజుకు తానూ చట్టబద్ద వారసురాలిననే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ, మీ దృష్టికి తెస్తున్నానని చెప్పారు. అయితే చెప్పింది ఆచరించే సీఎం జగన్‌కు ధన్యవాదాలు అని చివరలో పేర్కొన్నారు.

హిందూ అవిభక్త కుటుంబ ఆస్తులకు కొడుకులతో పాటు కూతుళ్లకు కూడా సమాన హక్కులు ఉంటాయని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. వారికి సమానత్వ హక్కును దక్కకుండా చేయడం కుదరదని తెలిపింది. హిందూ వారసత్వ (సవరణ) చట్టం 2005 అమలులోకి రావడానికి ముందు నుండి ఇది వర్తిస్తుందని, 2005 సెప్టెంబర్ 9కి ముందు పుట్టిన కూతుళ్లు విభాజ్య కుటుంబ ఆస్తులకు సమాన హక్కుదారులని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అప్పటికి వారి తండ్రి జీవించి ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. అవిభక్త హిందూ కుటుంబంలో జన్మించిన కుమార్తెలకు పూర్వీకుల ఆస్తుల్లో సమాన హక్కును 2005లో ప్రభుత్వం సవరణలు చేసింది. కొడుకు వలె కూతురు కూడా వారసురాలే అవుతుందని 2018లో సుప్రీం కోర్టు తెలిపింది.
Tags:    

Similar News