బాబు అప్పుడు ఇప్పుడూ ఒకేలా ఉన్నారంటున్న రోజా

Update: 2017-07-31 13:04 GMT
ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్రబాబు ఏమాత్రం మారలేదని వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు.  రాష్ట్రంలో ఉద్యోగ వ్యతిరేక పాలన సాగుతుందని, గతంలో మాదిరిగానే ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఎమ్మెల్యే రోజా ఫైర్‌ అయ్యారు. బయటకు మాది ఉద్యోగ సంక్షేమ ప్రభుత్వం అని చంద్రబాబు గొప్పులు చెబుతున్నారని, లోపల మాత్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. ఉదయం లేచింది మొదలు సమీక్షల పేరుతో ముప్పుతిప్పులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం టెలీ కాన్ఫరేన్సులతో అధికారులు నెత్తికొట్టుకుంటున్నారని తెలిపారు. మీ వద్ద పనిచేయలేమని ఐఏఎస్‌ లు ఢిల్లీకి పరుగులు తీస్తున్నారని రోజా చెప్పారు.

50 ఏళ్లకే ఉద్యోగులకు ఇంటికి పంపించే కుట్ర జరుగుతుందని ఎమ్మెల్యే రోజా అనుమానం వ్యక్తం చేశారు. మంత్రులకు తెలియకుండానే జీవోలు విడుదల చేశారా అని రోజా ప్రశ్నించారు. మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను రోజా తిప్పి కొట్టారు.ఉద్యోగుల ఫెర్ఫార్మెన్సుకు సంబంధించి ఈ నెల 18న మూడు శాఖలకు ఫైల్‌ పంపించింది వాస్తవమా? కాదా? దీనిపై  మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానం చెప్పాలని రోజా డిమాండ్‌ చేశారు. మంత్రి వద్దకు వచ్చే  ఫైల్‌ లో క్యాష్‌ ఉంటేనే సంతకం పెడుతున్నారా? లేక వెనక్కి పంపిస్తున్నారా? అని నిలదీశారు. ఇటీవల ప్రభుత్వంతో జరిపిన చర్చల అనంతరం ఉద్యోగ సంఘాలు బయటకు వచ్చి మాట్లాడింది అబద్ధమా? అని ప్రశ్నించారు. యనమల రామకృష్ణుడి శాఖలో తయారవుతున్న ముసాయిదాలు ఆయనకు తెలియకుండానే బయటకు వస్తున్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు. మేం ఫిట్‌ మెంట్‌ ప్రకటించామని మంత్రి యనమల ప్రకటించడం హాస్యస్పదమన్నారు. ఈ రోజు వరకు కూడా ఒక్క ఉద్యోగి ఖాతాలోనైనా ఆ డబ్బులు జమా చేశారా? ఇంతవరకు డీఏ ఇవ్వడం లేదని, పీఆర్‌ సీ బకాయిలు చెల్లించడం లేదని నిప్పులు చెరిగారు.

ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులంటే అంత గౌరవం ఉన్నట్లైతే.. వారిపై దాడులు చేసిన టీడీపీ నేతల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నార‌ని రోజా ప్ర‌శ్నించారు. టీడీపీ పాలనలో ఉద్యోగులకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులపై మీకు గౌరవం ఉంటే మహిళా తహశీల్దార్‌ వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇసుకలో వేసి కొడితే ఆమెకు ఇచ్చిన బహుమతి ఏంటి? అని ప్రశ్నించారు. తప్పు చేసిన చింతమనేనిని ఏమైనా అన్నారా? అని నిలదీశారు. 50 సంవత్సరాలకే పదవి విరమణ, 30 ఏళ్ల సర్వీస్‌ అంటూ నిబంధనలు పెడుతూ ఉద్యోగులను వేదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎస్‌ ఆఫీస్‌ బాలసుబ్రమణ్యంను టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే కొడితే మీరేం చేశారని ప్రశ్నించారు. పిలిచి సారీ చెబితే సరిపోతుందా? ఉద్యోగులకు ఎక్కడ భరోసా కల్పించారని ఫైర్‌ అయ్యారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ ఎస్‌ఐని బంధిస్తే మీరు చేసింది ఏంటీ?, మంత్రి పితాని సత్యానారాయణ ఇసుక లారీలను పట్టుకున్నారని ఎస్‌ఐని బదిలీ చేస్తారా అని నిలదీశారు. ఉద్యోగులు తిరగబడే రోజులు వచ్చాయని రోజా హెచ్చరించారు. ప్రభుత్వం ఉద్యోగులను వేదిస్తే ఊరుకోమని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వారికి అండగా ఉంటారని ఎమ్మెల్యే రోజా తెలిపారు.

సర్పంచ్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలను వదలని చంద్రబాబు ఉద్యోగులను వదలడం లేదని రోజా విమర్శించారు. టీడీపీకి అండగా లేని వారి మీద కక్షగట్టి వారి గొంతు మీద కత్తి పెడితే వారి పక్షాన వైఎస్‌ ఆర్‌ సీపీ పోరాడుతుందన్నారు.  బాబు విజన్‌ 13 ఏళ్ల ముందుకు వెళ్తే తెలుస్తుందని, ఆయన రాసిన మనసులో మాట అనే బుక్‌ చూస్తే చంద్రబాబు మనస్తత్వం అర్థం అవుతుందన్నారు. ఉద్యోగుల్లో అవినీతిపరులు ఉన్నారని, ప్రభుత్వ ఆదాయంలో ఎక్కువ భాగం ఉద్యోగుల జీతాలకే సరిపోతుందని తన బుక్‌లో రాసుకున్నట్లు రోజా గుర్తు చేశారు. బాబు క్షకపూరిత చర్యలు అర్థం చేసుకున్నారు కాబట్టే పదేళ్లు ఆయనను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. ఈ రోజు ఫెర్ఫార్మెన్స్‌ పేరుతో ఉద్యోగులకు ఇంటికి పంపించాలని కుట్ర చేస్తున్నారన్నారు. కాంట్రాక్ట్‌ వ్యవస్థను తీసుకొచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవుట్‌డేటేడ్‌ ముఖ్యమంత్రి కాబట్టి అలాంటి ఆలోచనలు వస్తున్నాయని రోజా ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదు. మీకు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అండగా ఉంటారని రోజా ధైర్యం చెప్పారు.
Tags:    

Similar News