ఏపీలో రిప‌బ్లిక్ సర్వే...వైసీపీదే పైచేయి

Update: 2018-12-25 07:09 GMT
న‌వ్యాంధ్ర‌ప్రదేశ్‌ లో ఎన్నికల నోటిఫికేషన్ సమయం కూడా ఇంకా రానేలేదు. అప్పుడే సర్వేలు వారి విశ్లేషణలను వెల్లడించేస్తున్నాయి. ఏపీ పార్టీలలో ఎన్నికల వేడి తెలంగాణ ఎన్నికల నుండి మరింతగా వేడెక్కింది. ఎవరికి వారు తమ క్యాడర్ ను సిద్ధపరుస్తున్నారు. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంపై సర్వేల హడావిడి ప్రారంభం అయింది. ఏపీలో పరిస్థితి ఎలా ఉండబోతుందో రిపబ్లిక్ టీవీ తాజా సర్వే ఫలితాలు వెల్ల‌డించాయి. బీజేపీకి వ్యతిరేక పార్టీలు ఏకం చేయడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో టీడీపీకి కొంత అనుకూలంగా ఉన్నట్టు ఈ సర్వే తెలిపింది. అయితే, వైసీపీకే అధికారం అవ‌కాశం ఉండ‌టం గ‌మ‌నార్హం.

గత కొంతకాలం వరకు వైఎస్ జగన్‌ కి అనుకూలంగా ఉందని - తీర్పు ఏకపక్షమేనని అంచనా వేసినా కాంగ్రెస్‌ తో టీడీపీ జతకట్టిన తర్వాత చంద్రబాబు మళ్లీ లైన్‌ లోకి వచ్చారని తెలిపింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి ఓటమి ప్రభావం ఏపీలో ఉండబోదని స్పష్టం చేసింది. ఏపీలో మొత్తం 24 పార్లమెంటు స్థానాలకు గానూ వైసీపీ 14 సీట్లను గెలుపొందుతుందని రిపబ్లిక్ టీవీ పేర్కొంది. మిగతా 11 సీట్లను టీడీపీ- కాంగ్రెస్ కూటమి కైవసం చేసుకుంటుందని చెప్పింది. వీటిలో 8 టీడీపీ - 3 కాంగ్రెస్ దక్కించుకుంటాయని రిపబ్లిక్ టీవీ ప్రీ-పోల్ సర్వే  వెల్లడించింది.  వైసీపీకి 41.6 శాతం ఓట్లు వస్తాయని - టీడీపీ- కాంగ్రెస్ కూటమికి 38.2 శాతం ఓట్లు దక్కించుకుంటుందని - బీజేపీకి 11 శాతం - ఇతరులు 9.3 శాతం ఓట్లు దక్కించుకుంటారని సర్వే ఫలితాలలో  పేర్కొంది. అయితే, అక్టోబరులో రిపబ్లిక్ టీవీ సర్వేలో వైసీపీ 21 స్థానాల్లో విజయం సాధిస్తుందని - టీడీపీకి కేవలం 4 సీట్లు మాత్రమే దక్కుతాయని అంచనా వేసింది.
Tags:    

Similar News