కమలం కలలు పండేనా....!?

Update: 2018-09-21 11:57 GMT
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ కోసం కంటున్న కలలు నిజమవుతాయా........అసలు అక్కడి ప్రజలు భారతీయ జనతా పార్టీని క్షమిస్తారా.......బిజేపినే కాదు రాబోయే ఎన్నికలలో ఆ పార్టీతో ఏ పార్టీ కలసి నడచిన ముప్పు తప్పదు.

రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌ లో తాము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ధీమాగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేకుంటే - ఇతర పార్టీలతో కలసి పనిచేస్తామని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలతో పొత్తుకు సిద్దంగా ఉన్నట్లు ఆయన తన పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారు. అయితే ఇది ఎంత వరకూ కలసి వస్తుదన్నది ప్రశ్నగానే మిగులుతుంది.

ఆంధ్రప్రదేశ్‌ లో జరగబోయే  ఎన్నికలలో తెలుగుదేశం - వైఎస్ ఆర్ కాంగ్రెస్ - జనసేన పార్టీల మధ్యనే ప్రధాన పోటి ఉంటుంది. వామపక్షలు అయిన సీపీఎం - సీపీఐ పార్టీలు మతత్తత్వ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీతో కలిసే అవకాశాలు లేనేలేవు. ఇక వైఎస్ ఆర్ పార్టీ ప్రధానంగా ప్రత్యేక హోదా నినాదంతో ప్రజలలోకి వెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని భారతీయ జనతా పార్టీ తేల్చి చెప్పేసింది. ఒకవేళ ఎన్నికలకు ముందు వైఎస్ ఆర్ పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టకుంటున్నట్లు ప్రకటిస్తే - ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోదీ సర్కారు మీద ఉన్న కోపంతో జగన్ మోహాన రెడ్డికి ఓటు వేయారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి జగన్ - భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు.  జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నా - వారివురికి ప్రభుత్వం ఏర్పాటు చేసేటంత మెజారిటీ రాదని విశ్లేషకులు అంటున్నారు. 

గురువారం నాడు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాంమాధవ్ ముఖ్య అతిధిగా హజారయ్యారు.  తెలుగుదేశం మినహా - భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలతో పొత్తుకు సిద్దంగా ఉన్నట్లు ఆయన తన పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తమ పార్టీ నాయకులకు - ఇతర కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు. భారతీయ పార్టీలోని కొందరు నాయకులు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని - అలాంటి వారికి ఉద్వాసన తప్పదని రాంమాధవ్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లో భారతీయ జనతా పార్టీని నమ్మే పరిస్థతి లేదని - రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా విషయంలో ఆ రాష్ట్రాన్ని నిట్టనిలువునా ముంచిన మోది స‌ర్కారుకు ఓటు వేసి మ‌రోసారి మోస‌పోలేమ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు అంటున్నారు.. అంతేకాక విభజన హామీలు అమలు చేయడంలో కూడా భారతీయ జనతా పార్టీ చొరవ చూపించలేదు. కనీసం రైల్వే జోన్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ ను చిన్న చూపు చూసింది. వీటన్నిటికీ తోడు గ‌త నాలుగేళ్ల‌ల్లో మోదీ సర్కార్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ప్రభావం కూడా అక్కడి ప్రజలపై ఉంది. అందుకు రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి  డిపాజిట్‌ కూడా దక్కే అవకాశాలు  లేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


Tags:    

Similar News