రాహుల్‌ ని ఉరి తీయమంటున్న బీజేపీ ఎమ్మెల్యే

Update: 2016-02-18 07:19 GMT
 కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దేశద్రోహి అని, ఆ 'రాజకుమారుడి'ని ఉరి తీయడమో కాల్చి చంపడమో చేయాలని భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే కైలాష్‌ చౌధరి వ్యాఖ్యానించి పెద్ద వివాదానికి తెరలేపారు. రాజస్థాన్‌ లోని బర్మర్‌ జిల్లా బైటూ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున ఎమ్మెల్యే కైలాష్‌ వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. రాహుల్‌ గాంధీ జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్శిటీని సందర్శించి అక్కడి విద్యార్థులతో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న నేపథ్యంలో కైలాష్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 'రాజకుమారుడి'గా కాంగ్రెస్‌ నేతలు పేర్కొనే రాహుల్‌ గాంధీకి దేశంలో నివసించే హక్కు లేదని కైలాష్‌ అన్నారు. పాకిస్తాన్‌ జిందాబాద్‌, అఫ్జల్‌ గురు అమర వీరుడని కీర్తించే వారికి మద్దతు పలకడం శోచనీయమని ఆయన అన్నారు.  దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు రాహుల్‌ గాంధీ అయినా, మరెవరైనా సరే వారిని ఉరి తీయాల్సిందేనని అన్నారు.

కాగా  రాహుల్‌ గాంధీ - కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలవనున్నారు. జేఎన్‌ యూ ఘటనపై రాహుల్‌ రాష్ట్రపతి కి వివరించనున్నారు. రాహుల్ ఇంతకుముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనల్లోనూ తలదూర్చారు. ఇక్కడ కూడా అఫ్జల్ గురును కీర్తించే విద్యార్థులకు రాహుల్ మద్దతు పలకడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.

Tags:    

Similar News