రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

Update: 2021-05-16 12:30 GMT
అభివృద్ధి కార్యక్రమాలు, కరోనా రోగులను ఆదుకునేందుకు  వెళుతున్న  మల్కాజిగిరి లోకల్ ఎంపీ రేవంత్ రెడ్డిని సైతం పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక ఎంపీగా గాంధీ ఆస్పత్రి దగ్గర రోగుల కోసం ఎంపీ రేవంత్ రెడ్డి అన్నదానం చేస్తున్నారు. వారికి భోజనం పెట్టేందుకు వెళుతున్న ఎంపీ రేవంత్ రెడ్డిని బేగంపేటలో పోలీసులు అడ్డుకున్నారు.

తనను అడ్డుకున్న పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఓ ఎంపీగా నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి వెళుతుంటే ఇలా అడ్డుకోవడం ఏంటని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘తాను ఒక లోకల్ ఎంపీని.. నన్ను ఆపమని చెప్పిందెవడు? మీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో చెప్పండి. ఆ కాగితాలు చూపిండి.. ఈ ప్రభుత్వానికి బుర్ర ఉందా? నేను ఇక్కడ ఎంపీని.. మీ ఆంక్షలు గాంధీ ఆస్పత్రి దగ్గర పెట్టుకోండి.. బేగంపేటలో కాదు..’’ అని రేవంత్ రెడ్డి రోడ్డుపైనే పోలీసులతో గొడవకు దిగాడు..

నేడు లోకల్ ఎంపీగా కరోనా రోగులను ఆదుకోవడానికి ఈరోజు గాంధీ, సికింద్రాబాద్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు పెట్టుకున్నానని.. నన్ను ఆపమని చెప్పింది ఎవరు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

మీ పోలీసుల లాగానే నేను కూడా ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గరకు వెళుతుంటే ఎందుకు ఆపుతున్నారు అంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి దగ్గర రోగుల బంధువులకు నిత్యం వెయ్యి మందికి అన్నదానం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. రెండోరోజు కూడా గాంధీతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద చేపట్టాలని ఎంపీ భావించారు. ఈ నేపథ్యంలో వెళుతున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
Tags:    

Similar News