ట్రాఫిక్ సిగ్నల్స్ ను కూడా వదలని టిఆర్ఎస్ ..కష్టాల్లో సిటీ వాసులు !

Update: 2021-10-25 15:30 GMT
తెలంగాణ అధికార పార్టీ మూడేళ్ల త‌ర్వాత‌  ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న ప్లీన‌రీపై సోష‌ల్ మీడియాలో స‌టైర్లు పేలుతున్నాయి. ఎటు చూసినా గులాబీ వ‌ర్ణంలో ఉన్న ఫ్లెక్సీలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. హైద‌రాబాద్‌లోని హెటెక్స్‌లో నిర్వ‌హిస్తున్న ప్లీన‌రీని పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఈ క్ర‌మంలో న‌గ‌రం స‌హా.. చుట్టుప‌క్కల జిల్లాల్లోనూ భారీ ఎత్తున కేసీఆర్ క‌టౌట్లు  పార్టీ జెండాల‌ను ఏర్పాటు చేసింది.  టీఆర్ ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా సిటీలో ఎక్కడపడితే అక్కడ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టడంపై రగడ మొదలైంది. సిటీ లో పలు చోట్ల సిగ్నల్స్ కూడా కనిపించకుండా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు . దీనితో వాహనదారులు ఏ సిగ్నల్ పడిందో తెలియక తికమక పడుతున్నారు. ఈ ప్లెక్సీలు అందరికి చాలా ఇబ్బందులకి గురి చేస్తున్నాయి. దీనితో సాధారణ ప్రజలు ప్లెక్సీలు పెడితే లక్షల్లో ఫైన్స్ వేసే పోలీసులు , ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.

గతంలో  కేసీఆర్ ఈ క‌టౌట్ల హంగామా గురించి చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా వారు గు్ర్తు చేస్తున్నారు.రాజకీయ నాయకులు తమ ముఖాలను తామే చూసుకోవడానికే ఫ్లెక్సీలు పనికొస్తాయి. ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన లీడర్స్‌ కారు. ప్లాస్టిక్‌ అనేది భూతం. అది మనల్ని వెంటాడుతుంది. దానిపై యుద్ధం చేయాలి. ఫ్లెక్సీలు పెట్టడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. వాటిని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెట్టినా సరే  ఫ్లెక్సీ పెట్టినందుకు మీ (ఇల్లందు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌)కు రూ.లక్ష ఫైన్‌ వేస్తున్నా  అని గత ఏడాది మార్చి 2న ఇల్లందు పర్యటన సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను నెటిజ‌న్లు ప్ర‌స్తావిస్తున్నారు. తర్వాత కూడా పలుమార్లు ఫ్లెక్సీలపై మంత్రి కేటీఆర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల వాడకం చాలా పెరిగిపోయిందని, ఈ సంస్కృతిని పూర్తిగా నిర్మూలించాలని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పర్యటనకు వెళ్లిన సందర్భంలోనూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన పలువురు కార్పొరేటర్లకు జరిమానా వేయాలని పలుమార్లు ఆదేశించారు. కానీ, ఇప్పుడు టీఆర్ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా అడుగ‌డుగునా,. ఫ్లెక్సీలు పెట్టారు. రోడ్డుకు ఇరు వైపులా అంగుళం అంత గ్యాప్ లేకుండా.. పార్టీ జెండాలు క‌ట్టారు. దీంతో నాటి సుద్దులు ఇప్పుడు ఏమ‌య్యాయంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే టిఆర్ ఎస్  పార్టీ ప్లీనరీ సందర్భంగా సిటీలో ఎక్కడబడితే అక్కడ టిఆర్ ఎస్  పార్టీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడంపై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సిటీలో ఎక్కడపడితే అక్కడ టీఆర్ ఎస్  ఫ్లెక్సీలను, కటౌట్లను ఏర్పాటు చేశారని, ఫ్లెక్సీలు, కటౌట్లు పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించిన మంత్రి కేటీఆర్ ఇప్పుడు హైదరాబాద్ లో  ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలపై , కటౌట్ లపై సమాధానం చెప్పాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తుంది బీజేపీ. హైదరాబాద్ నగరం అంతా టిఆర్ఎస్ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. నగరంలోని ప్రముఖుల విగ్రహాలను సైతం వదలకుండా తోరణాలు కట్టడంపై బిజెపి నాయకులు మండిపడుతున్నారు. మీ పార్టీకి ఓ న్యాయం ఇతర పార్టీలకు మరో న్యాయమా అంటూ దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలి అంటున్నారు.
Tags:    

Similar News