బీజేపీని ఆ పాయింట్లో విమ‌ర్శిస్తే మీకే న‌ష్టం లోకేష్

Update: 2018-07-09 17:30 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడైన మంత్రి లోకేష్ పార్టీ ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచారు. ఇటీవ‌లి కాలంలో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులైన వైసీపీ - బీజేపీ - కాంగ్రెస్‌ - జ‌న‌సేన‌ల‌పై ఆయ‌న ట్విట్ట‌ర్‌ లో ఒకింత చురుకుగా స్పందిస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పర్యటన సంద‌ర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఎప్ప‌ట్లాగే ఆ పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేశారు. కర్నూలు ఉస్మానియా కాలేజ్ గ్రౌండ్స్ లో డ్వాక్రా సంఘాలలోని ముస్లిం మహిళలతో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వ‌హించారు. 2014లో హేతుబద్దత లేకుండా రాష్ట్ర విభజన చేశార‌ని - కట్టుబట్టలతో మనల్ని బయటకి గెంటేశార‌ని ఎప్ప‌ట్లాగే సెంటిమెంట్ అస్త్రం తీశారు. 16 వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పరిపాలన అందిస్తున్నారని త‌న తండ్రిపై ప్ర‌శంస‌లు కురిపించారు. అతి చిన్న వయస్సులో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని అయ్యానని త‌న గురించి కూడా లోకేష్ చెప్పుకున్నారు.!

68 ఏళ్ల వయస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడుతుంటే హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోయి బీజేపీ కుట్ర రాజకీయం చేస్తోందని లోకేష్ పేర్కొన్నారు. హోదా ఇవ్వని మోడీ ని విమర్శించకుండా పవన్ - జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై అనేక ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. `జగన్ - పవన్ మోదీ పేరు చెప్పగానే వణికిపోతున్నారు.అందుకే మోదీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఎన్డీఏ నుండి బయటకి రాగానే బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ అని ప్ర‌క‌టించింది. ఇదేం ప్రేమ‌? నిజంగా బీజేపీకి అంత ప్రేమ ఉంటే కర్నూలుని దేశానికి రెండో రాజధాని గా ప్రకటించాలి. పవన్ బీజేపీ డిక్లరేషన్ అమలు చేస్తున్నారు..ఇప్పుడు ఆయన ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రం అంటున్నారు`` అని ఆరోపించారు.

అయితే, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌ల విష‌యంలో లోకేష్ కీల‌క‌మైన లాజిక్ మిస్ అయ్యార‌ని చ‌ర్చించుకుంటున్నారు. నాలుగేళ్ల పాటు అదిగో - ఇదిగో హోదా అని కేంద్రం మాట‌లు చెప్తుంటే...ఇప్పుడు లోకేష్ బాబు విమ‌ర్శిస్తున్న బీజేపీతోనే..ఆయ‌న పార్టీ అయిన టీడీపీ అధికారం పంచుకుంది. ప్ర‌త్యేక హోదా విష‌యంలో వెన్నుపోటు పొడుస్తోంద‌ని ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తే...ప్యాకేజీతోనే అభివృద్ధి అంటూ స‌న్నాయి నొక్కులు నొక్కింది. అయితే, ప్ర‌జా వ్య‌తిరేక‌తను గ‌మ‌నించి నాలుగేళ్ల‌ అనంత‌రం ప్ర‌త్యేక‌హోదా స‌హా విభ‌జ‌న హామీల గురించి, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల గురించి టీడీపీ స్పందిస్తోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ నాలుగేళ్ల త‌ర్వాత స్సందించ‌డం అదే కోవ‌లోకి వ‌స్తుంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News