బాబుదొక రూటు.. చినబాబుది ఇంకో రూటు

Update: 2017-11-18 17:17 GMT
తండ్రీకొడుకుల పార్టీగా ముద్ర వేసుకుంటున్న టీడీపీలో ఇప్పుడు కొత్త చర్చ ఒకటి వినిపిస్తోంది. చంద్రబాబు ఎడ్డెం అంటే కొడుకు లోకేశ్ తెడ్డెం అంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ డీజీపీ నియామకం విషయంలో తండ్రీకొడుకులిద్దరూ తలో దారిన సాగుతున్నారని టాక్.
    
ప్రస్తుత ఇన్ ఛార్జి డీజీపీ సాంబశివరావును కొనసాగించాలని ముఖ్య‌మంత్రి చంద్రబాబు కోరుకుంటుండగా.. ఆయన తనయుడు - మంత్రి నారా లోకేష్ మాత్రం ఠాకూర్ ను ఈ పోస్టులో నియమించేలా పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది.  మరోవైపు ఠాకూర్ కూడా లోకేశ్ అండతో కేంద్రంలో తన వంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారట.
    
ఏపీ నుంచి కొద్దికాలం కిందట దేశంలో ఉన్నత పదవి అందుకున్న ఓ సీనియర్ నేత సహాయంతో ఠాకూర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో కేంద్రం తీరు కూడా ఠాకూర్ కు అనుకూలంగానే ఉందని అంటున్నారు. ఏడాదిన్నరకు పైగా ఇన్ ఛార్జి డీజీపీగా కొనసాగించిన సాంబశివరావును తిరిగి రెగ్యులర్ డీజీపీగా నియమించాలని కోరుతూ ప్యానల్ పంపటంతో కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. ఇంత కాలం ఆయన్ను పదవిలో ఉంచి…. ఇప్పుడు ఆయన పేరు పంపటం ఏ మాత్రం సరికాదని లేఖ పంపింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం మళ్ళీ అదే జాబితాను తిరిగి పంపటంతో కేంద్రం మరింత సీరియస్ అయింది. కొత్త జాబితా వచ్చే వరకూ అసలు ఈ పేర్లను పరిగణనలోకి తీసుకోవద్దని హోం శాఖను ఆదేశించింది. అయినా చంద్రబాబు పట్టువిడవకుండా ప్రయత్నిస్తుండడం... అదే సమయంలో లోకేశ్ కూడా ఠాకూర్ కోసం ప్రయత్నిస్తుండడంతో ఎవరి మాట నెగ్గుతుందో ఏమో అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
Tags:    

Similar News