కేసీఆర్ స్టైల్‌: రైతుకు బేడీలు, ఉగ్ర‌వాదుల‌కు పూలు

Update: 2017-05-26 11:33 GMT
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటన ఆ పార్టీలో  మంచి ఊపే తీసుకొచ్చింది. మూలనున్న నేతలు కూడా బయటకొచ్చి మైకు పట్టుకుంటున్నారు. తాజాగా సీనియర్ బీజేపీ లీడర్ నాగం జనార్దన్ రెడ్డి కూడా షా పర్యటన తరువాత స్పీడు పెంచుతున్నారు. కేసీఆర్ పై విమర్శల పర్వం ప్రారంభించారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్‌ హౌస్‌లో రూ. 2400 కోట్లు కుంభకోణం జరిగిందని,  రూ.50 కోట్ల మోటార్లు రూ.90 కోట్లకు అంచనాలు పెంచారని ఆయన ఆరోపించారు. దీనిపై ఆధారాలతో సహా కేసీఆర్ కు లేఖ రాసినట్టు చెప్పారు. తాము చెప్పింది తప్పయితే తమపై కేసు నమోదు చేసి జైలుకు పంపాలని.. లేదంటే కేసీఆర్‌ స్థానం కేరాఫ్‌ శశికళ అవుతుందని విమర్శించారు.
    
కేసీఆర్‌ అవినీతిలో మొనగాడని, మోడీతో పోల్చుకునే స్థాయి ఆయనకు లేదని నాగం మండిపడ్డారు.  రైతులకు బేడీలు.. ఉగ్రవాదులకేమో గులాబీ పూలు.. ఇదీ కేసీఆర్‌ విధానమంటూ తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు కేంద్రం 700 కోట్లు ఇస్తే అదంతా ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహి అయిన కేసీఆర్‌.. అమిత్‌ షాను అవమానిస్తారా అని నిలదీశారు.
    
తెలంగాణకు రక్షణ కావాలంటే రజాకార్లను పెట్టుకుంటారా.. ఫెడరల్‌ స్పూర్తి ఉండకూడదా.. ముస్లింల పేరుతో, కులాల పేరుతో..పందులు.. కుక్కలు నక్కల పేరుతో ఎందుకు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అమిత్‌ షా నాయకత్వంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News