46 రోజులుగా ఇండియాలోనే మోడీ !

Update: 2016-02-09 11:03 GMT
విపక్షాల నుంచి వస్తున్న విమర్శల కారణంగా తగ్గారో ఏమో కానీ ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల విదేశీ పర్యటనలను తగ్గించారు. అవును... ఆయన గత 46 రోజులుగా ఇండియాలోనే ఉన్నారు. దీంతో ఇది రికార్డు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విపరీతంగా ప్రపంచ దేశాల్లో తిరగడంతో ఆయనకు ఫ్లయింగ్ ప్రైం మినిస్టర్ గా ఇప్పటికే పేరొచ్చేసింది. ఆయనకు ల్యాండ్ సిక్ నెస్ ఉందంటూ ఎన్నో జోకులు కూడా వేశారు. అలాంటి ప్రధాని దాదాపు నెల పదిహేను రోజులుగా ఏదేశానికీ వెళ్లకుండా ఇండియాలోనే ఉండడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
    
నరేంద్ర మోడీ ప్రధాని అయి 20 నెలలు దాటాయి. అప్పటి నుంచి ఆయన వరుసగా ఇండియాలో ఎక్కువ రోజులు గడపడం ఇది రెండో సారట. ఇంతకుముందు 2014 నవంబరు 26 నుంచి 2015 మార్చి 9 వరకు ఏ దేశానికీ వెళ్లకుండా కంటిన్యూగా 72 రోజులు ఇండియాలోనే ఉన్నారాయన. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు 46 రోజులుగా ఇండియాలోనే ఉన్నారు. 2015 డిసెంబరు 25న పాకిస్థాన్ నుంచి వచ్చిన తరువాత ఆయన ఎక్కడికీ వెళ్లలేదు. దీంతో ఇది రెండో రికార్డు అయింది.
    
కాగా మరో 40 రోజుల వరకు ప్రధానికి ముందస్తుగా నిర్ణయించిన పర్యటనలు లేకపోవడంతో అప్పటి వరకు ఇండియాలోనే ఉంటే పాత రికార్డు బ్రేక్ అవుతుంది. ఈ ఏడాది మార్చి 31న అయన అమెరికాలో అణుసదస్సుకు వెళ్లనున్నారు. అప్పటివరకు ఇండియాలో ఉంటే 82 రోజులు వరుసగా ఉన్నట్లవుతుంది. మధ్యలో ఎక్కడికైనా వెళ్తే మాత్రం పాత రికార్డే పదిలంగా ఉంటుంది. మోడీ ప్రధాని పదవి చేపట్టిన తరువాత ఇంతవరకు 28 దేశాల్లో పర్యటించడం విశేషం. దీంతో మోడీ ఇండియాలో ఉన్నా కూడా రికార్డులుగా పరిగణించాల్సిన పరిస్థితి వచ్చింది.
Tags:    

Similar News