'మెస్సేజ్‌ ఇన్‌ ఏ బాటిల్' ... మానవాళికి సందేశం ఏమిటంటే ?

Update: 2020-12-04 14:30 GMT
మనం రోజూ ఉపయోగించే  కొన్ని ప్లాస్టిక్  బాటిల్స్ వల్ల అనేక ఇబ్బందులు ఎదురౌతాయి అని తెలిసినా కూడా ప్లాస్టిక్ బాటిళ్లు వాడటం మాత్రం మానలేదు. అయితే మనం మురికి కాలువల్లో పడేసే ప్లాస్టిక్‌ బాటిళ్లు ఇతర మార్గాల్లో కలసి, వాటి నుంచి నదులకు, అక్కడి నుంచి సముద్రాలకు చేరి వాటిలొని సకల జల చరాలకు ప్రాణాంతకం అవుతున్నాయనే సంగతి తెలిసిందే. అయితే ఇలా పడేసే ప్లాస్టిక్‌ బాటిళ్లు జల మార్గాల్లో ఎంత దూరం ప్రయాణిస్తాయో తెలిస్తే  ఆశ్చర్య పడాల్సిందే. మానవాళికి పర్యావరణ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు ' నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సొసైటీ' తరఫున బ్రిటన్‌ లోని ఎక్సిటర్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు భారత్‌ లోని గంగా నదిలో, బంగాళాఖాతంలో, హిందూ మహాసముద్రంలో 500 ఎంఎల్‌ కలిగిన కొన్నిబాటిళ్లను వదిలి పెట్టారు.

ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ బాటిళ్ల గమనాన్ని ఎప్పటికప్పుడు తెలసుకునేందుకు వీలుగా వాటిలో శాటిలైట్‌, జీపీఎస్‌ ట్యాగ్‌ లను ఏర్పాటు చేశారు. వాటిలో ఆశ్చర్యంగా గంగా నదిలో వదిలేసిన ఓ ప్లాస్టిక్‌ బాటిల్‌ మిగితా రెండు వేర్వేరు సముద్రాల్లో వదిలేసిన బాటిళ్లకన్నా మరింత ఎక్కువ దూరం ప్రయాణించింది.ఆ బాటిల్ 94 రోజుల్లో 2, 845 కిలోమీటర్లు ప్రయాణించింది. ‍ఈ ప్రయోగానికి స్ఫూర్తినిచ్చిందీ   మెస్సేజ్‌ ఇన్‌ ఏ బాటిల్  అనే హాలీవుడ్‌ సినిమా. 1999లో లూయీ మండోకి దర్శకత్వంలో వెలువడిన ఆ ప్రేమ కథా చిత్రం నాటి కుర్రకారును విశేషంగా అలరించింది. అందుకే అదే చిత్రం స్సూర్తితో ఈ ప్రయోగానికికూడా  'మెస్సేజ్‌ ఇన్‌ ఏ బాటిల్‌' అని పేరు పెట్టారు. ఇలాగే ప్రపంచ మానవాళి నిర్లక్ష్యంగా పడేసే ప్లాస్టిక్‌ వ్యర్థ పదార్థాలు ఏటా సముద్రాలకు 80 లక్షల టన్నులు చేరుకుంటోందని ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేషన్‌ లెక్కలు తెలియజేస్తున్నాయి. సముద్రాలకు చేరుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థ పదార్థాల్లో 80 శాతం నదుల ద్వారా వస్తున్నవేనని కనుగొన్నారు.

ఈ ప్రయోగంలో వాడే బాటిల్స్ పలు కారణాలతో ఆగిపోవచ్చనే ఉద్దేశంతో మొత్తం ప్రయోగానికి 25 బాటిళ్లను ఉపయోగించారు. వాటిలో 22 బాటిళ్లు సరాసరి దూరం 165 మైళ్లు, అంటే దాదాపు 267 కిలోమీటర్లు చేరుకున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఆ తర్వాత వాటిలో 14 బాటిళ్ల ఆచూకీ చిక్క లేదని, వాటిలో కొన్ని ప్రజల చేతికి చిక్కగా మిగతావి శాటిలైట్‌ యాంటెన్నా పాడై పోవడం వల్ల వాటి గమ్యాన్ని గుర్తించలేక పోయామని పరిశోధకులు ప్రకటించారు. గంగా నదిలోనే ప్లాస్టిక్‌ బాటిళ్లు ఎక్కువగా చిక్కుకుపోయే అవకాశం ఉండడంతో అక్కడే ఎక్కువ బాటిల్స్ వదిలినట్టు తెలిపారు.
Tags:    

Similar News