శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. రెండు కిలోమీటర్ల మేర దహనమైన అటవీ సంపద.. కారణం ఎవరు..?
తిరుమల పుణ్యక్షేత్రానికి రక్షణ కవచంలా ఉండే శేషాచలం అడవుల్లో కార్చిచ్చు చెలరేగడం పర్యావరణ ప్రేమికులను, భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.;
తిరుమల పుణ్యక్షేత్రానికి రక్షణ కవచంలా ఉండే శేషాచలం అడవుల్లో కార్చిచ్చు చెలరేగడం పర్యావరణ ప్రేమికులను, భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. మొండోడికోన వంటి కీలక ప్రాంతాల్లో మంటలు వ్యాపించడం వల్ల అమూల్యమైన అటవీ సంపదతో పాటు వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉంది. తిరుమల కొండల పాదాల చెంత ఉన్న జీవకోన సమీపంలో ఆదివారం సాయంత్రం సంభవించిన కార్చిచ్చు పెను కలకలం సృష్టించింది. సుమారు 2 కిలోమీటర్ల మేర అడవి అగ్నికి ఆహుతి కావడం సామాన్యమైన విషయం కాదు.. ఈ ప్రాంతం ఎర్రచందనం గిడ్డంగులకు, భక్తులు సంచరించే కాకులమాను ప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్ల ప్రమాద తీవ్రతను అధికారులు ముందుగానే పసిగట్టి అప్రమత్తమయ్యారు. అటవీశాఖ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ప్రమాదం జరగడం భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది.
కార్చిచ్చుకు ప్రధాన కారణాలేంటి?
సాధారణంగా వేసవి అడవుల్లో మంటలు చెలరేగడానికి రెండు ప్రధాన కారణాలు ఉంటాయి. ఎండ తీవ్రత పెరిగినప్పుడు అడవిలో ఎండుటాకులు, గడ్డి ఎండిపోయి ఉంటుంది. చెట్ల కొమ్మలు ఒకదానికొకటి రాసుకోవడం వల్ల లేదా రాళ్ల మధ్య ఘర్షణ వల్ల పుట్టే నిప్పు కూడా అతిపెద్ద కార్చిచ్చుకు కారణం కావచ్చు. ప్రస్తుతం అధికారులు మానవ తప్పిదమా? లేక మరేదైనా కారణమా అన్న కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. అటవీ సరిహద్దు ప్రాంతాల్లోకి వెళ్లే ఆకతాయిలు సరదా కోసం నిప్పు పెట్టడం, లేదంటే పర్యాటకులు పారవేసే సిగరెట్ పీకల వల్ల ఈ మంటలు చెలరేగే అవకాశం ఉంది అంటున్నారు. గంజాయి సాగు చేసే వారు లేదంటే అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లే వారు నిప్పు రాజేయడం కూడా గతంలో చూసినట్లు అధికారులు చెప్తున్నారు.
అటవీ సంపదకు నష్టం
శేషాచలం అడవులు కేవలం చెట్లకు మాత్రమే కాదు.. ఎంతో విలువైన ఔషధ మొక్కలు, అంతరించిపోతున్న వన్యప్రాణులకు నిలయం. ఈ మంటలు ఎర్రచందనం గిడ్డంగుల వరకు వెళ్లడం ఆందోళనకరం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలపను కాపాడుకోవడం అధికారులకు సవాలుగా మారింది. చిన్నపాటి మంటలే కదా అని మనం అనుకోవచ్చు, కానీ అడవిలో ఉండే సరీసృపాలు, నెమళ్లు, అడవి పందులు, జింకలు వంటి ప్రాణులు మంటల్లో కాలిపోవడం లేదంటే మంటలతో వ్యాపించే పొగకు ఊపిరాడక చనిపోవడం జరుగుతుంది. వాటి ఆవాసాలు ధ్వంసం కావడం వల్ల అవి జనారణ్యంలోకి వచ్చే ప్రమాదం ఉంది.
నివారణ చర్యలు
అటవీ ప్రాంతం కొండలతో, లోయలతో ఉండడం వల్ల అగ్నిమాపక వాహనాలు లోపలికి వెళ్లడం అసాధ్యం. మంటలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాపించకుండా మధ్యలో గడ్డిని తొలగించి ‘ఫైర్ లైన్స్’ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. స్థానిక ప్రజలు, అటవీశాఖ సిబ్బంది పచ్చటి ఆకులతో కొడుతూ మంటలను ఆర్పే సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తుంటారు. ఆకతాయిల కదలికలను కనిపెట్టడానికి, మంటలు ఎక్కడ ప్రారంభమయ్యాయో తెలుసుకోవడానికి డ్రోన్ల ద్వారా నిఘా పెంచాల్సిన అవసరం ఉంది.
శేషాచలం అడవులను కాపాడుకోవడం కేవలం అటవీశాఖ బాధ్యత మాత్రమే కాదు.., ప్రతి ఒక్కరి బాధ్యత. ముఖ్యంగా వేసవిలో అటవీ ప్రాంతాల్లోకి వెళ్లే వారు నిప్పుతో కూడిన వస్తువులను తీసుకువెళ్లకుండా చూడాలి. కపిలతీర్థం వంటి సున్నితమైన ప్రాంతాల్లో గస్తీని మరింత పెంచాలి. ఒకవేళ ఇది ఆకతాయిల పనే అని తేలితే, కఠిన శిక్షలు విధించడం ద్వారా ఇతరులకు హెచ్చరిక పంపాలి. అడవి కాలిపోతే కేవలం చెట్లు మాత్రమే కాదు, పర్యావరణ సమతుల్యతకు కూడా నష్టం కలుగుతుందని మర్చిపోకూడదు.