అడుగులు ముందుకు పడ్డాయా ?

Update: 2021-12-27 13:33 GMT
రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేయటానికి బీసీల నుండి ప్రయత్నం మొదలైనట్లే ఉంది. రాజ్యాధికారం సాధన కోసం బీసీలు, కాపులు కలిసి పనిచేయాలని ఈమధ్యనే పాలకొల్లులో జరిగిన శెట్టి బలజల ఆత్మీయ సమావేశంలో కుడిపూడి సూర్యానారాయణ పిలుపిచ్చారు. ఆయన చెప్పింది శెట్టిబలిజలంతా కాపులతో స్నేహం చేయాలని, స్నేహం పెంచుకుని దగ్గరవ్వాలన్నారు. కాపులతో బీసీలు కలిసిపోయి మంచి రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలని పిలుపిచ్చారు.

కార్యక్రమంలో ఆయన చెప్పింది శెట్టిబలిజలనే అయినా ఆ పిలుపు హోలు మొత్తం బీసీలకు వర్తిస్తుంది. ఎందుకంటే తాజాగా కుడిపూడి నేతృత్వంలో కొందరు నేతలు కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళి భేటీ అయ్యారు. దాదాపు రెండుగంటలపాటు భేటీ జరిగింది. రాబోయే ఎన్నికల్లో బీసీలు, కాపులు ఐకమత్యంగా కలిసి పనిచేయాలనే లైన్ మీద చర్చలు జరిగాయి. బీసీలు, కాపులతో పాటు ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలను కూడా కలుపుకుని వెళ్ళాలనే అంశంపైన కూడా చర్చ జరిగింది.

ఇదే సమయంలో పై వర్గాలన్నింటినీ కలుపుకుని తొందరలోనే కొత్త రాజకీయపార్టీ పెట్టాలనే ఉద్దేశ్యంతో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. మరి కేశన చేస్తున్న ప్రయత్నాలు తెలిసి కూడా కుడిపూడి విడిగా ముద్రగడను కలవటం ఏమిటో అర్దం కావటంలేదు. కేశన-కుడిపూడి ఉపకులాలు వేరయ్యుండచ్చు కానీ ఉద్దేశ్యం ఒకటే అయినపుడు అందరు కలిసే భేటీ అయ్యుంటే బాగుండేదనే చర్చలు అప్పుడు మొదలైంది.

మొన్నటివరకు బీసీ-కాపులకు ఏ విషయంలో అయినా చుక్కెదురన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి ఉభయగోదావరి జిల్లాల్లో పై రెండు సామాజికవర్గాలకు ఏమాత్రం పడదు. నిజానికి వాళ్ళమధ్య ఉన్న వైరం వల్ల రెండు సామాజికవర్గాలు నష్టపోతున్నాయి. అయినా తమ పంతాన్ని మాత్రం వదులుకోవటంలేదు. ఇలాంటి నేపధ్యంలోనే కుడిపూడి రూపంలో రెండు సామాజికవర్గాలు కలిస్తే బాగుంటుందనే ప్రయత్నం మొదలైంది.

కుడిపూడి ప్రయత్నాన్ని కాపుల్లోని ప్రముఖులు కూడా స్వాగతిస్తున్నారు. ఇందులో భాగంగానే ముద్రగడ ఇంట్లో మొదటి సమావేశం జరిగింది. తొందరలోనే మళ్ళీ సమావేశం అవ్వాలని నిర్ణయించినా ఈసారి మరింత విస్తృతమైన వేదిక మీద కలవాలని డిసైడ్ అయ్యింది. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళున్న సమయంలో రెండు బలమైన సామాజికవర్గాలు ఏకమవ్వాలని జరుగుతున్న ప్రయత్నాలు ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సిందే.


Tags:    

Similar News