కొడాలి మాట : ఎన్టీయార్ విగ్రహానికి ఎన్ని రంగులైనా....

Update: 2022-06-28 12:07 GMT
ఎన్టీయార్ ఏ పార్టీకి చెందిన వారు. అంటే తెలుగుదేశం పార్టీ అని అందరూ అంటారు. నిజానికి ఇపుడు ఉన్న తెలుగుదేశం పార్టీ ఆయనదే.. ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆ విధంగా చూస్తే ఆయన మా వాడు అని టీడీపీ పూర్తిగా క్లెయిం చేసుకోవచ్చు. కానీ ఎన్టీయార్ అందరి వాడు అంటున్నారు వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని. ఆయన ప్రజా నాయకుడని, ఆయనకు పార్టీల రంగులు లేవని కూడా చెబుతున్నారు. ఎవరి అభిమానం వారిదని, ఆ విధంగా ఎన్టీయార్ ని అందరూ ఆరాధించవచ్చునని చెబుతున్నారు.

లాజిక్ పరంగా చూస్తే ఇది బాగానే ఉంటుంది. కానీ ఎన్టీయార్ పేరిట ఒక పార్టీ ఉంది. అది ఏపీలో వైసీపీకి గట్టి పోటీగా ఉంది. ఆ పార్టీ వారు తమ నేత అని ఎన్టీయార్ ని చెప్పుకుంటున్న వేళ ఆయన అందరి వాడు రంగులు ఏ పార్టీవైనా వేయవచ్చు అంటూ కొడాలి నాని చెబుతున్న భాష్యం వక్రంగా ఉందా అన్న చర్చ కూడా వస్తోంది. వైఎస్సార్ మా వాడు అని టీడీపీ రంగులు వేస్తే అపుడు వైసీపీ నేతలు ఊరుకుంటారా అన్నది కూడా ఇక్కడ ప్రశ్న.

నిజానికి ఈ లోకాన్నే వదిలేసి దేహాన్నే త్యజించి వెళ్ళిపోయిన వారు అన్నింటికీ అతీతులు. అయితే వారి ఆనవాళ్ళు  గురుతులూ ఉంటాయి. వాటి మీద రాజకీయ క్రీనీడ పడనంతవరకూ అంతా ఓకేగా ఉంటుంది.  కానీ ఒక్కసారి అలా పడితే మాత్రం అపుడే రచ్చ సాగుతుంది. ఎన్టీయార్ మా వాడు అంటే మా వాడు అని వైసీపీ టీడీపీలు యుద్ధానికి దిగితే అది చివరికి ఆయనకే అవమానం అన్నది కూడా ఆలోచించాలి.

అయితే గుడివాడలో జరిగిన వైసీపీ నియోజకవర్గ ప్లీనరీ సభలో కొడాలి నాని ఎవడురా మా ఎన్టీయార్ ని తమ వాడు అని చెప్పేది అంటూ గర్జించారు. ఈ చంద్రబాబుకు ఎన్టీయార్ రాజకీయం కోసం గుర్తుకు వచ్చారా అని కూడా నిలదీశారు. ఎన్టీయార్ మా ఆస్తి, ఆయన మా కోసం పార్టీ పెట్టారు, ఆయన పార్టీని, ముఖ్యమంత్రి పదవిని లాగేసుకుని చంద్రబాబు ఆయనకు వెన్నుపోటు పొడిచారు అని కూడా గర్జించారు.

ఎన్టీయార్ ని మానసిక వ్యధకు గురి చేసి ఆయన మరణానికి కారకుడు చంద్రబాబు అయ్యారని కూడా విమర్శించారు. ఎన్టీయార్ కి టీడీపీకి సంబంధం ఏమీ లేదని చెప్పి ఆనాడు కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాసారా లేదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీయార్ ని రాజకీయంగా మోసం చేసి ఇపుడు ఆయన మా వాడు అంటే జనాలు నమ్ముతారా అని కొడాలి నాని అంటున్నారు.

చంద్రబాబు గుడివాడ వచ్చి తన మీద దమ్ముంటే పోటీ చేయాలని కూడా నాని సవాల్ చేశారు. ఇక చంద్రబాబు తాను పుట్టిన చంద్రగిరి నియోజకవర్గాన్ని వదిలి ఎందుకు కుప్పం వెళ్లారు అని ప్రశ్నించారు. ఇక ఎన్టీయార్ పుట్టిన నిమ్మకూరు ఉన్న పామర్రు సీటులో చంద్రబాబు ఏనాడు టీడీపీని గెలిపించలేకపోయారని ఎద్దేవా చేశారు.

ఏపీలో ఎన్ని శక్తులు అడ్డు వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని కూడా నాని చెబుతున్నారు. అలాగే గుడివాడలో తాను 2024లో మాత్రమే కాదు, 2029లోనూ గెలిచి తీరుతాను అని ఆయన బల్లగుద్దారు. మొత్తానికి నాని ఎన్టీయార్  విషయంలో కెలికిన కెలుకుడు ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద చర్చ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News