తగ్గేది లేదు.. జగన్ నో కాంప్రమైజ్

Update: 2019-12-10 06:52 GMT
కంటపడ్డావా జగన్ కనికరిస్తాడు.. కానీ వెంటపడితే మాత్రం వేటాడడమే.. ’ అరవింద సమేతలోని రాయలసీమ డైలాగును అక్షరాల అదే రాయలసీమకు చెందిన సీఎం జగన్ పాటిస్తున్నాడని పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అవును ఏపీలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు చూశాక జగన్ తీరులో స్పష్టమైన మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

ఏపీలో గద్దెనెక్కాక  సీఎం జగన్ కేంద్రంతో సత్సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. కేంద్రంలోని మోడీషాలతో అనుబంధం పెంచుకుంటున్నారు. కానీ వారు పైకి సహృద్భావంగా ఉంటూ ఏపీలో రాజకీయాలు చేయడం మొదలుపెట్టారని వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి.

ఏపీలో టీడీపీని తుత్తునియలు చేసే బలపడే క్రమంలో వైసీపీ సర్కారును కూడా బీజేపీ టార్గెట్ చేసింది. ఈ క్రమంలో నర్సాపురం ఎంపీ కూడా మోడీషాలతో సాన్నిహిత్యం నెరపడం ప్రారంభించాడు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పర్మిషన్ లేకుండా ఎవ్వరూ కేంద్ర మంత్రులు మోడీషాలను కలువవద్దని ఆదేశాలున్నా నర్సాపురం ఎంపీ మాత్రం కలవడం దుమారం రేపింది.

ఓవైపు వైసీపీతో  కేంద్రంలోని బీజేపీ సఖ్యతగా ఉంటూనే.. మరోవైపు వైసీపీ కీలక ఎంపీలు, నేతలతో సాన్నిహిత్యం నెరపడం సీఎం జగన్ కు నచ్చలేదని టాక్ వినిపించింది. అందుకే తోక జాడిస్తున్న నర్సాపురం ఎంపీని చెక్ చెప్పేందుకు 2014లో ఇదే నర్సాపురం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన గోకరాజు రంగరాజు ఫ్యామిలీని వైసీపీలో చేర్చుకున్నారు సీఎం జగన్. నిన్న సాయంత్రం వారు బీజేపీని వీడి వైసీపీలో చేరడం కమలదళానికి భారీ షాక్ లా మారింది. అంతేకాదు.. ప్రతీసారి తోకజాడిస్తూ ఎగిరిపడుతున్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు కూడా జగన్ గోకరాజు ఫ్యామిలీని చేర్చుకొని షాకిచ్చారు. వచ్చేసారి రఘురామకృష్ణం రాజుకు టికెట్ కష్టమేనన్న సంకేతాలిచ్చారు.

ఇలా ఒకే దెబ్బకు అటు బీజేపీని, ఇటు సొంత పార్టీ ఎంపీని చావుదెబ్బతీశారు జగన్ అని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. బీజేపీతో సాన్నిహిత్యంగా ఉంటూనే ఆ పార్టీ ఎత్తులకు చిత్తు అవకుండా జగన్ వ్యవహరిస్తున్న వ్యూహాత్మక వైఖరి ప్రత్యర్థులకు హెచ్చరికనే అంటున్నారు
Tags:    

Similar News