కర్నాటక, తమిళనాడులో కూడా జగన్ ప్రభావం

Update: 2020-12-16 10:30 GMT
జగన్మోహన్ రెడ్డి ప్రభావం తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలపైన కూడా పడినట్లే ఉంది. తమిళనాడులో వచ్చే ఏడాది జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మక్కళ్ నీది మయ్యుమ్ (ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ మాట్లాడుతు తమ పార్టీ అధికారంలోకి రాగానే తమిళనాడుకు రెండో రాజధానిని ఏర్పాటు చేస్తానని ప్రకటించేశారు. మదురైలో ఎన్నికల సభలో మాట్లాడుతూ మదురయ్యే తమిళనాడుకు రెండో రాజధానిగా ఉంటుందని హామీ ఇచ్చేశారు.

ఎంఎన్ఎం అధికారంలోకి వస్తుందా రాదా ? అన్నది వేరే విషయం. హామీనే కదా ఇచ్చేస్తో పోయేదేముంది ? అన్న పద్దతిలోనే చాలా పార్టీలు జనాలకు హామీలిచ్చేస్తున్నాయి. అందులోను ఎన్నికల హామీలంటే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. బహుశా కమల్ కూడా ఇందుకే మదురైని రెండో రాజధానిగా చేస్తానని ప్రకటించేశారు. ఇందుకు కారణం ఏమిటంటే ఒకపుడు తమిళనాడుకు మదురయ్యే రాజధానిగా ఉండేదట. తర్వాతెపుడో రాజధాని చెన్నైకి మారిందనేది కమల్ వాదన. చూడబోతే జగన్ నుండి కమల్ కూడా స్పూర్తి పొందినట్లే ఉంది.

ఇక కర్నాటక విషయానికి వస్తే కర్నాటక రాష్ట్రం ఆర్టీసీలో గడచిన ఆరురోజులుగా దీక్షలు జరుగుతున్నాయి. కన్నడ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు పెద్దగా తిరగటం లేదు. వేలాదిమంది ఉద్యోగులు పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేయాలని. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేయటమన్నది ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ అన్న విషయం తెలిసిందే. హామీ ఇచ్చినట్లే అధికారంలోకి రాగానే ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేశారు.

ఈ నేపధ్యంలో కొన్ని సమస్యలున్నప్పటికీ వాటిని జగన్ పెద్దగా పట్టించుకోలేదు. కాస్త అటు ఇటు చేసి మొత్తానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటమనే తన హామీని నెరవేర్చేశారు. ఇక్కడి నుండే కేఎస్ఆర్టీసీ ఉద్యోగులు స్పూర్తి పొందినట్లే ఉంది చూస్తుంటే. అందుకనే కర్నాటకలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో ఉద్యమమే మొదలైంది. మరక్కడ యడ్యూరప్ప ప్రభుత్వం చివరకు ఏమి చేస్తుందో చూడాల్సిందే.
Tags:    

Similar News