శశికళ వైదొలగడానికి కారణం అదేనట?

Update: 2021-03-07 01:30 GMT
తమిళనాడును ఏలేద్దామని జైలు నుంచి విడుదలై వచ్చాక తొడగొట్టిన తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ అనూహ్యంగా తమిళ రాజకీయాల్లోంచి శాశ్వతంగా రిటైర్ అవుతున్నట్టు ఇటీవల ప్రకటించి సంచలనం సృష్టించారు. సీఎం అవుతారనుకున్న ఆమె అర్ధాంతరంగా తమిళ రాజకీయాల నుంచి తప్పుకోవడంలో కారణం ఏంటన్న ప్రశ్నలు ఉదయించాయి.

తాజాగా శశికళ వైదొలగడం వెనుక ఇద్దరు వ్యక్తులు ప్రధాన పాత్ర పోషించినట్టు శుక్రవారం వెలుగుచూసింది.గత నెల 24న జయలలిత జయంతి రోజున తాను రాజకీయాల్లో పోటీచేయబోతున్నట్టు శశికళ స్వయంగా ప్రకటించారు. అన్నాడీఎంకే నుంచి కానీ.. ఏఎంఎంకే నుంచి కానీ పోటీచేస్తానని అన్నారు. మేనల్లుడు దినకరణ్ ను అనూహ్యంగా దూరం పెట్టారు.

అయితే శశికళను కలిసిన ఓ బీజేపీ దూత రాయబారం నడిపారని.. అన్నాడీఎంకే ఓటమికి కారణం కావద్దని.. అనవసరంగా డీఎంకే గెలుపునకు దోహద పడవద్దని సూచించినట్టు తెలిసింది. ఇక సమీప బంధువు ఒకరు కూడా శశికళను కలిసి అన్నాడీఎంకే ఓటమితో చెడ్డపేరు మూటగట్టుకోవద్దని సూచించారట..

తనకు తానే ముఖ్యమంత్రి అభ్యర్థి శశికళ మేనల్లుడు దినకరణ్  ప్రకటించుకోవడం, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగంను కూటమిగా మలుస్తూ అన్నాడీఎంకేను ఆహ్వానించడం వంటి పిల్లచేష్టలకు శశికళ  విరక్తి చెందారని  సమాచారం. టీటీవీ దినకరన్, మరికొందరు వెన్నుపోటుదారుల వల్లనే రాజకీయాల నుంచి శశికళ తప్పుకోవాల్సి వచ్చిందని స్వయానా ఆమె తమ్ముడు,'అన్నా ద్రావిడర్‌ కళగం' ప్రధాన కార్యదర్శి దివాకరన్‌ వ్యాఖ్యానించి అసలు కారణాన్ని బయటపెట్టాడు.
Tags:    

Similar News