రెండు దశాబ్దాల్లో భారత్‌ టాప్‌ 3 కి చేరుతుంది : అంబానీ !

Update: 2020-12-16 09:30 GMT
ఆర్థిక వ్యవస్థల్లో భారత్ రోజురోజుకి పుంజుకుంటుంది. ఈ తరుణంలో భారత ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ వచ్చే రెండు దశాబ్దాల్లో భారత్‌ టాప్‌ 3 లోకి చేరుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. దేశ  తలసరి ఆదాయం రెట్టింపవుతుందని చెప్పారు. ఫేస్ ‌బుక్‌ ఫ్యూయల్‌ ఫర్‌ ఇండియా 2020 కార్యక్రమంలో భాగంగా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్ ‌బుక్‌ సీఈవో మార్క్‌ జకర్ ‌బర్గ్‌ తో వర్చువల్‌ సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

దేశీయంగా మొత్తం కుటుంబాల్లో 50 శాతం పైగా వాటా ఉండే మధ్యతరగతి కుటుంబాల సంఖ్య ఏడాదికి మూడు.. నాలుగు శాతం మేర వృద్ధి చెందుతుందని అంబానీ చెప్పారు. రాబోయే రోజుల్లో భారత్‌ ఆర్థికంగా, సామాజికంగా మరింత వేగంగా వృద్ధి చెందబోతోందని, ఫేస్ ‌బుక్, జియో సహా ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహిక వ్యాపారవేత్తలు, కంపెనీలు ఈ ప్రక్రియలో పాలుపంచుకునేందుకు ఇది బంగారంలాంటి అవకాశమని ఆయన తెలిపారు.  వచ్చే రెండు దశాబ్దాల్లో టాప్‌ 3 ఎకానమీల్లో ఒకటిగా భారత్‌ ఎదుగుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. యువ జనాభా ఊతంతో ప్రీమియర్‌ డిజిటల్‌ సమాజంగా కూడా ఎదుగుతుంది. మా తలసరి ఆదాయం 1,800–2,000 డాలర్ల నుంచి 5,000 డాలర్లకు పెరుగుతుంది అని అంబానీ అన్నారు.  

కరోనా మహమ్మారి భారీ స్థాయిలో విరుచుకుపడటం.. మిగతా అందరిలాగే భారత్‌లో ప్రజల్నీ కలవరపర్చింది. అయితే, సంక్షోభాలకు వెరవడమన్నది బహుశా భారతీయుల డీఎన్ ‌ఏ లో లేదేమో. అందుకే మేం దీన్ని దీటుగా ఎదుర్కొనగలిగాం అని చెప్పారు.  ప్రతీ సంక్షోభం.. ఒక కొత్త అవకాశం కల్పిస్తుందని అంబానీ చెప్పారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అత్యంత భారీ స్థాయిలో టీకాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారత్‌ సర్వసన్నద్ధంగా ఉందన్నారు. డిజిటల్‌ ఇండియా నినాదం ఊతంతో కనెక్టివిటీ పెరగడం వల్ల కరోనా వైరస్‌పరమైన పరిస్థితులను భారత్‌ దీటుగా ఎదుర్కొనగలిగిందని చెప్పారు.
Tags:    

Similar News