ఆ విష‌యంలో మ‌న‌కంటే పాక్ ముందుంది!

Update: 2017-02-19 09:34 GMT
భార‌త‌దేశం ప్రపంచంలో శరవేగంగా వృద్ధి చెందుతుంద‌నే గుర్తింపు పొందిన‌ప్ప‌టికీ... ఆర్థిక స్వేచ్ఛ విషయంలో మాత్రం మన పొరుగు దేశమైన పాకిస్థాన్ కంటే వెనుకబడి ఉన్నామని ఓ సర్వే వెల్లడించింది. అమెరికాకు చెందిన హెరిటేజ్ ఫౌండేషన్ అనే సంస్థ ఆర్థిక స్వేచ్ఛ విషయంలో ప్రపంచంలోని 180 దేశాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. అందులో భారత్‌ కు 143వ స్థానం దక్కింది. అవినీతి, మౌలిక వసతుల లేమి ఇందుకు ప్రధాన కారణాలుగా కన్పిస్తున్నాయి. ఆర్థిక స్వేచ్ఛలో పాకిస్థాన్‌ తోపాటు మన ఇరుగు పొరుగు దేశాలన్నీ మెరుగైన స్థానంలో ఉండటం గమనార్హం.

ఈ సంస్థ విడుదల చేసిన లిస్టులో పాకిస్థాన్‌ కు 141వ స్థానం లభించింది. ఇక నేపాల్ 125, శ్రీలంక 112, భూటాన్ 107, బంగ్లాదేశ్ 128వ స్థానంలో నిలిచాయి. గడిచిన ఐదేండ్లుగా భారత్ సరాసరి జీడీపీ 7 శాతంగా ఉన్నప్పటికీ, వృద్ధి ఫలాలు ఆర్థిక స్వేచ్ఛను పెంచలేకపోయాయని, మార్కెట్ ఆధారిత సంస్కరణల అమలు అసమానంగా ఉందని హెరిటేజ్ ఫౌండేషన్ పేర్కొంది. ప్రభుత్వ చట్టాలు, బహిరంగ మార్కెట్ల నియంత్రణతోపాటు పలు ఆర్థిక అంశాలను ఈ నివేదిక తయారీలో పరిగణనలోకి తీసుకున్నారు. నిర్భందకరమైన నియంత్రణ విధానం దేశంలో పారిశ్రామికీకరణను నిరుత్సాహపరుస్తున్నదని, ఫలితంగా ప్రైవేట్ రంగం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందలేకపోతున్నదని రిపోర్టు అభిప్రాయపడింది.

ఇదిలాఉండ‌గా....పాకిస్తాన్.. తెగలు, రాజకీయాలు, జాతుల ఆధారంగా నిప్పు రాజేస్తోంది. ముఖ్యంగా కరాచీ నగరం భారత వ్యతిరేక జిహాదిస్టులకు కేంద్రంగా అవతరించింది. యూరప్‌కు చెందిన ప్రధాన సంస్థల్లో ఒకటయిన ‘ద ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్’ తన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడించింది. భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలయిన లష్కర్ ఎ తోయిబా/ జమాత్ ఉద్ దావా (ఎల్‌ఇటి/ జెయుడి), జైష్ ఎ మొహమ్మద్ (జెఇఎం)లు కరాచీలో తమ కార్యకలాపాలను నిర్విఘ్నంగా కొనసాగించడానికి ప్రభుత్వ భద్రతా బలగాలు వీలు కల్పిస్తున్నాయని ‘కరాచీలో నిప్పు రాజేస్తున్న పాకిస్తాన్’ అనే శీర్షికతో రూపొందించిన తన నివేదికలో వివరించింది. ‘పాకిస్తాన్‌లోని అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థలు కరాచీ నగరాన్ని, నగరంలోని వనరులను బాగా ఉపయోగించుకుంటున్నాయి. నగరంలో ఉన్న పెద్ద, బాగా ఆర్థిక వనరులున్న మదరసాలతో షియా వ్యతిరేక లష్కర్ ఎ ఝాంగ్వీ (ఎల్‌ఇజె), భారత వ్యతిరేక ఎల్‌ఇటి/జెయుడిలకు గట్టి సంబంధాలు ఉన్నాయి" అని ఈ నివేదిక వెల్లడించింది.

‘ఎప్పుడు పాకిస్తాన్- భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగినా, కాశ్మీర్‌లో ఉద్రిక్తతలు పెరిగినా ఈ ఉగ్రవాద సంస్థలన్నీ కరాచీ నగర నడిబొడ్డున సమీకృతమవుతుంటాయి. ఎల్‌ఇటి, జెఇఎంలను దేశంలోని కొంత భాగంలో మీ మిత్రులుగా, మిగతా ప్రాంతాల్లో శత్రువులుగా భావించజాలరు’ అని ఇటీవలే పదవీవిరమణ పొందిన ఒక సీనియర్ రాష్ట్ర అధికారి ప్రభుత్వాన్ని ఉద్దేశించి పేర్కొన్నారని ఈ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ఘర్షణలను నివారించడానికి బ్రస్సెల్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్వతంత్ర సంస్థ.. పాకిస్తాన్‌ లో అతిపెద్ద, సంపన్నమైన కరాచీ నగరం దశాబ్దాల తరబడి సాగిన ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణ లోపం వల్ల ‘ప్రెషర్ కుక్కర్’ వలె మారిందని వివరించింది. సింధ్ పోలీసులకు అధికారాలను పునరుద్ధరించాలని, స్వతంత్రంగా పనిచేయడానికి వీలు కల్పించాలని, జవాబుదారీగా కూడా చేయాలని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వానికి ఈ నివేదిక పిలుపునిచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News