పవన్ గెస్ట్ హౌస్ దగ్గర రాత్రేం జరిగింది?

Update: 2016-08-27 07:48 GMT
జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాన్ తిరుమలలో ఉన్న సంగతి తెలిసిందే. తిరుపతికి చెందిన తన అభిమాని హత్యకు గురైన నేపథ్యంలో.. వారి తల్లిదండ్రుల్ని పరామర్శించేందుకు వచ్చిన ఆయన..తిరుమలకు వెళ్లటం.. స్వామి దర్శనం చేసుకున్నారు. అక్కడి వరకూ బాగానే జరిగినా.. ఉన్నట్లుండి రోజు వ్యవధిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని.. అందుకు ఏర్పాట్లు చేయాలంటూ తన సన్నిహితుల్ని కోరారు.

ఉరుము.. మెరుపు లేకుండా బహిరంగ సభకు ఏర్పాట్లు చేయమనటం ద్వారా మరో సంచలనానికి తెర తీసిన పవన్ కల్యాణ్.. తిరుమలలోనే ఉండిపోయారు. దీంతో ఆయన బస చేసిన టీఎస్సార్ అతిథి గృహానికి అభిమానులు పోటెత్తారు. ఏ నిమిషాన ఏం చెబుతారో అన్న విషయం తెలియక.. మీడియా సైతం ఆయన బస చేసిన గెస్ట్ హౌస్ బయటే ఉండిపోయారు. తమ అభిమాన హీరో కోసం ఎదురుచూస్తుంటే.. మీడియా మాత్రం ఆయన ఎలాంటి కొత్త నిర్ణయం తీసుకుంటారన్న ఉత్సుకతతో నిద్రలేని రాత్రి గడిపారు.

పవన్ బస చేసిన గెస్ట్ హౌస్ ఎదుట భారీగా జనసందోహం చేరుకున్నా.. పవన్ మాత్రం బయటకు రాలేదు. గంట గంటకు జనం తాకిడి పెరిగిపోవటంతో పాటు.. ఆయన ఒక్కసారైనా బయటకు వస్తేచూడాలన్న అతృతలో పెద్ద ఎత్తున అభిమానులు గెస్ట్ హౌస్ దగ్గరరాత్రంతా ఉండిపోయారు. మధ్యమధ్యలో ఆయన ఉన్న గెస్ట్ హౌస్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయటం.. పోలీసులు.. సెక్యూరిటీ సిబ్బంది వారిని కంట్రోల్ చేశారు. దీంతో.. శుక్రవారం రాత్రంతా హడావుడి నెలకొంది. ఇంత జరుగుతున్నా పవన్ మాత్రం ఎవరికి దర్శనభాగ్యం కల్పించలేదు. పార్టీకి సంబంధించిన పలువురితో ఆయన సుదీర్ఘంగా భేటీ కావటం కనిపించింది. ఈ ఉదయం స్వామి వారిని దర్శనం చేసున్నారు. ఏమైనా పవన్ మీదున్న అభిమానం ఎంతన్నది రాత్రి ఆయన బస చేసిన గెస్ట్ హౌస్ బయట నెలకొన్న సందడి చూస్తే ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.
Tags:    

Similar News