ఫిరాయింపు ఎమ్మెల్యేల ఆశలపై గవర్నరు నీళ్లు

Update: 2016-10-22 06:02 GMT
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు గవర్నరు నరసింహన్ కీలక సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫిరాయింపులను ప్రోత్సహించారన్న విమర్శలు చంద్రబాబుపై భారీగా ఉండడంతో కనీసం ఇక నుంచైనా అలాంటిది మానుకోవాలని సూచించినట్లు సమాచారం. అయితే... నేరుగా అలా చెప్పకుండా మంత్రివర్గ విస్తరణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్థానమివ్వకపోవడం బెటర్ అన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు గవర్నరు మాట ఎంతవరకు పాటిస్తారన్నది తెలియకపోయినా ఒకవేళ పాటిస్తే మాత్రం మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల ఆశలు ఆవిరైనట్లే.
    
కాగా పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం విచ్చేసిన గవర్నర్ నరసింహన్‌ తో ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు రెండు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి సచివాలయం పూర్తిగా తరలివచ్చిన నేపథ్యంలో అక్కడి భవనాలను తమకు అప్పగించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నుంచి ఓ ప్రతిపాదన వచ్చినట్లుగా గవర్నర్ ప్రస్తావిస్తే దానికి బదులుగా చంద్రబాబు 9 - 10 షెడ్యూలు ప్రకారం జరగాల్సిన పంపకాలు ఇంకా పెండింగ్‌ లో ఉన్నాయని, ముందుగా వాటి విషయం చూడాలని, ఇక సచివాలయం భవనాల అప్పగింతపై తమ మంత్రివర్గంలో చర్చించడం, ఆపై ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని సమాధానం ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది.
    
వీటితో పాటు మంత్రివర్గ విస్తరణ అంశం కూడా గవర్నరుతో చర్చించగా ఆయన ఇలా ఫిరాయింపుదారులను పక్కనపెట్టాలని సూచించినట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు వద్ద లాబీయింగ్ చేస్తున్న ఫిరాయింపు నేతలంతా చంద్రబాబు ఏం చేయబోతున్నారో తెలియక టెన్షన్ పడుతున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News