చైనాలో ‘రియల్‌’ ప్రకంపనలు

Update: 2021-10-05 23:30 GMT
చైనాలోని ఫాంటాసియా హోల్డింగ్స్‌ సంస్థ అక్టోబర్‌ 4వ తేదీన బాండ్లపై చెల్లింపులు చేయలేనని ప్రకటించింది. దీంతో చైనాలో రియల్‌ ఎస్టేట్‌ సంస్థల పరిస్థితి, పారదర్శకతపై ప్రపంచ వ్యాప్తంగా సందేహాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే ఎవర్‌గ్రాండె దాదాపు 300 బిలియన్‌ డాలర్ల అప్పులు ఎగ్గొట్టే దిశగా అడుగులు వేస్తుండగా, ఇప్పుడు దానికి ఫాంటాసియా అనే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ తోడైంది. తాను కూడా బాండ్లపై చెల్లింపులు చేయలేనని చేతులెత్తేసింది. దీంతో చైనాలో రియల్‌ ఎస్టేట్‌ రంగం తీవ్ర కష్టాల్లో ఉన్న విషయం వెలుగులోకి వస్తోంది. ఇదే నిజమైతే చైనా వృద్ధిరేటు దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

సోమవారం ఉదయం ఫాంటాసియా రేటింగ్‌ను ప్రముఖ రేటింగ్‌ కంపెనీ ఫిచ్‌ B నుంచి 'CCC-'కు తగ్గించింది. సెప్టెంబర్‌ 28వ తేదీన చెల్లించాల్సిన 100 మిలియన్‌ డాలర్లు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొంది. ఫాంటాసియా మాత్రం తాము సెప్టెంబర్‌ 28వ తేదీనే సంబంధిత ఖాతాల్లో చెల్లించాల్సిన నగదు జమ చేసినట్లు పేర్కొన్నట్లు ఫిచ్‌ వెల్లడించింది. ఒక రోజు ఆలస్యంగా బాండ్‌ హోల్డర్లకు అందుతాయని ఆ కంపెనీ చెబుతోందని పేర్కొంది. రేటింగ్‌ తగ్గించిన తర్వాత ఫాంటాసియా నుంచి ప్రకటన వెలువడింది. తాము విదేశీ చెల్లింపులను చేయలేకపోయినట్లు వెల్లడించింది.

ఈ కంపెనీకి 1.9 బిలియన్‌ డాలర్ల ఆఫ్‌షోర్‌ బాండ్లు, దాదాపు మరో బిలియన్‌ డాలర్ల విలువ చేసే దేశీయ బాండ్లు కూడా ఉన్నాయి. ఎవర్‌ గ్రాండె తో పోలిస్తే ఫాంటాసియా కంపెనీ నికర విలువ 415 మిలియన్‌ డాలర్లు మాత్రమే. కానీ, బాండ్ల చెల్లింపుల్లో విఫలం కావడం చైనా స్థిరాస్తి రంగంలో సమస్యలను చెబుతున్నాయి. ప్రస్తుతం ఫాంటాసియా 12.7 కోట్ల చదరపుటడుగుల ప్రాపర్టీలను అభివృద్ధి చేస్తోంది. మొత్తం 47 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. 2016లో జారీ చేసిన 500 మిలియన్‌ డాలర్ల విలువైన బాండ్లకు సంబంధించి ఈ ఏడాది చెల్లింపులు చేయాల్సి ఉందని సోమవారం ఎక్స్‌ఛేంజి ఫైలింగ్‌ లో పేర్కొంది. కానీ, 206 మిలియన్‌ డాలర్లను చెల్లించలేనని చివర్లో ప్రకటించింది.

కంపెనీ అనుబంధ సంస్థ సోమవారం చెల్లించాల్సిన 108 మిలియన్‌ డాలర్ల రుణాన్ని కూడా చెల్లించలేదని చైనాలో అతిపెద్ద ప్రాపర్టీ సంస్థ కంట్రీ గార్డెన్‌ హోల్డింగ్స్‌ పేర్కొంది. మరోపక్క ఫాంటాసియా సమీకరించిన 150 మిలియన్‌ డాలర్ల విలువైన బాండ్ల వివరాలు ఫైనాన్షియల్‌ స్టేట్‌ మెంట్‌ లో చూపలేదని ఫిచ్‌ పేర్కొంది. కంపెనీలో పారదర్శకత లోపించిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పింది.
ఆకాశహర్మ్యాలతో నిర్మించిన కొత్త పట్టణాలు చైనాలో ఖాళీగా దర్శనమిస్తుంటాయి. పశ్చిమదేశాల మీడియా లు వీటిని తరచూ ఘోస్ట్‌ సిటీ (దెయ్యపు నగరం)లుగా వెక్కిరిస్తుంటాయి. చైనాలో 1970ల్లో ప్రజలు వ్యవసాయం నుంచి ఇతర రంగాలకు మారడం మొదలుపెట్టారు. అదే సమయంలో పట్టణీకరణ, నిర్మాణ రంగాలు ఊపందుకున్నాయి. దీంతో అప్పటి వరకు 18శాతం మాత్రమే ఉన్న పట్టణ జనాభా గతేడాదికి 64శాతానికి చేరింది. ఇక్కడ కోటి మందికిపైగా ఉన్న నగరాలు 10 వరకు ఉన్నాయి.

ప్రపంచంలో పదోవంతు మంది ప్రజలు చైనా నగరాల్లో నివసిస్తున్నారు. పట్టణ జనాభా పెరుగుతుండటంతో స్థానిక ప్రభుత్వాల ఆదాయం కూడా బాగా పెరిగింది. పన్నులు, భూవిక్రయాలు, వ్యాపారాలపై పన్ను రూపంలో భారీగా సమకూరుతోంది. స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వ వాటా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు వేగంగా నిర్మాణాలు చేపట్టాయి. ప్రైవేటు సంస్థలు ఇదే బాటలో పనిచేశాయి. చైనా జీడీపీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 29శాతం వాటా రియల్‌ ఎస్టేట్‌ రంగానిదే. ఈ క్రమంలో స్థిరాస్తి రంగం బుడగ వలే పెరుగుతూ పోయింది.

ఫలితంగా ఈ రంగంలో నిర్మాణాలతోపాటు స్పెక్యూలేషన్‌ కూడా పెరిగిపోయింది. దీంతో సంపన్న చైనీయులు ఇళ్లను కొనుగోలు చేసి ఖాళీగా ఉంచుతున్నారు. ఫలితంగా చాలా ప్రావిన్స్‌లలో వరుసగా ఖాళీగా ఉన్న ఆకాశహర్మ్యాలు కనిపిస్తుంటాయి. కంగ్‌బాషి, తియాంజెన్‌ లో బిన్హయి న్యూ ఏరియా, జాంగ్జూలోని జెంగ్‌డాంగ్‌ న్యూడిస్ట్రిక్ట్‌, ఖష్గర్‌ వీఘర్ల కోసం నిర్మించిన కాలనీలు, ఇన్నర్‌ మంగలోనియాలోని క్వింగ్స్‌ హుయి, యునాన్‌ ప్రావిన్స్‌లోని చెంగాంగ్‌ ప్రాజెక్టు వంటివి ప్రపంచ వ్యాప్తంగా ఘోస్ట్‌ సిటీలుగా పేరు తెచ్చుకున్నాయి. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ లెక్కల ప్రకారం 9 కోట్ల మందికి గృహ సౌకర్యం కల్పించేంత స్థాయిలో ఖాళీ ఇళ్లు ఉన్నాయి.

రియల్‌ ఎస్టేట్‌ ఇలానే పెరుగుతూ పోతే ఏదో ఒక రోజు కుప్పకూలతుందని చైనా అధ్యక్షుడు షీజిన్‌ పింగ్‌ గ్రహించారు. 2017లో ఆయన 19వ సీసీపీ కాంగ్రెస్‌లో మాట్లాడుతూ..ఇళ్లు ఉండేది నివసించడానికి..అంతేగానీ స్పెక్యూలేషన్‌ కు కాదు అని వ్యాఖ్యానించారు. దీని ఫలితంగానే గతేడాది త్రీరెడ్‌ లైన్స్‌ పాలసీని తెచ్చారు. అడ్డగోలుగా అప్పులు తీసుకోవడాన్ని ఇది నియంత్రించింది. ఇప్పటికే చైనా ఆర్థిక వ్యవస్థ అడ్డగోలుగా పెరిగిన రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ఆధారపడింది. దీంతో ఎవర్‌గ్రాండె వంటి గాలిబుడగ సంస్థల వృద్ధి ఇప్పుడు పేలిపోయే దశకు చేరింది


Tags:    

Similar News