29శాతం అసత్య వార్తల ప్రచారం తగ్గింది: ట్విట్టర్

Update: 2020-11-25 05:30 GMT
సోషల్ మీడియా వచ్చాక ఏ మారుమూల వార్త అయినా.. ఏ వింత అయినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతోంది. అయితే అది నిజమా? అబద్దమా? అన్నది కూడా తేల్చుకోవడం కష్టమవుతోంది.  ఇక ఇదే సోషల్ మీడియాతో ఎవరిపైనా.. ఎవరైనా దుమ్మెత్తి పోసేందుకు ఆస్కారం ఏర్పడింది.దానికి సెన్సార్ లేకపోవడంతో ప్రముఖులు, సెలబ్రెటీలు ట్రోలింగ్ లకు బలైపోతున్నారు. తప్పుడు వార్తలతో అల్లకల్లోలం అవుతోంది.

ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టు ఇప్పటికే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ కు ఆదేశాలిచ్చాయి. ఖచ్చితంగా తప్పుడు వార్తలను సర్క్యూలేట్ చేయవద్దని సూచించాయి. దీంతో ఇప్పుడు ప్రఖ్యాత సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ రంగంలోకి దిగింది.

నకిలీ వార్తలను ప్రచారం చేసేటప్పుడు ట్విట్టర్ డిస్ ప్యూటెడ్ ట్వీట్ పేరుతో హెచ్చరికలను జారీ చేస్తుంది. అయినప్పటికీ  కొంతమంది వాటిని రీట్వీట్ చేస్తుండడంతో  మరో ఫీచర్ ను ట్వీట్టర్ తీసుకొచ్చింది.

డిస్ ప్యూటెడ్ ట్వీట్ ను షేర్ చేసేటప్పుడు ఓ విండోలో ‘ఇది వివాదాస్పదమైన ట్వీట్. రీట్వీట్ చేసేముందు మరింత సమాచారం తెలుసుకోండి’ అని సందేశం వచ్చేలా తీర్చిదిద్దారు. దీనివల్ల అసత్య ప్రచారం వార్తలు ఏకంగా 29శాతం తగ్గాయని ట్విట్టర్ తెలిపింది. ఇలా అసత్య వార్తల ప్రచారాన్ని తమ ఫ్లాట్ ఫామ్ లో తగ్గించినట్టు  ట్విట్టర్  వివరించింది.
Tags:    

Similar News