బీజేపీ దెబ్బకు ఆప్.. అల్లకల్లోలం!
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు బీజేపీ భారీషాక్ ఇచ్చింది. ఏడుగురు రాజ్యసభ సభ్యులను తన పార్టీలో చేర్చుకుంది.;
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు బీజేపీ భారీషాక్ ఇచ్చింది. ఏడుగురు రాజ్యసభ సభ్యులను తన పార్టీలో చేర్చుకుంది. అయితే.. వాస్తవానికి వారిలో ఒకరిద్దరు తప్ప.. మిగిలిన వారికి రాజకీయంగా సొంతగా ఎదిగే సత్తాలేదు. కేవలం ఆప్లో కేజ్రీవాల్ దన్నుతోనే వారు నెట్టుకువచ్చారన్నది వాస్తవం. అయినప్పటికీ.. కేజ్రీవాల్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్న ఏకైక లక్ష్యంతో బీజేపీ తాజాగా ఏడుగురిని తనవైపు మలుచుకుంది. అయితే.. దీనిని కేజ్రీవాల్ బలంగా అడ్డుకునే అవకాశం ఉందా? ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా? అనేది ప్రశ్న.
ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఏ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులైనా మూటింట రెండు వంతుల మంది పార్టీ మారితే.. ఆ చట్టం వర్తించదు. పైగా.. సదరు సభ్యులు మారిన పార్టీలో వారు విలీనం అయినట్టుగా సభాపతి ప్రకటించే అవకాశం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్లో చేరినప్పుడు.. `విలీనం` ప్రకటన చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అలానే.. టీడీపీ రాజ్యసభ సభ్యులు వరుస పెట్టి బీజేపీ తీర్థం పుచ్చుకున్నప్పుడు కూడా.. రాజ్యసభ చైర్మన్ ఇదే ప్రకటన చేశారు. ఇలా.. మూడింట రెండు వంతుల మంది సభ్యులు పార్టీ మారితే.. ఇక ప్రశ్నించేందుకు అవకాశం లేదు.
ఆప్ పరిస్థితి ఇదీ..
ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరిలో ఏడుగురు ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే.. మూడింట రెండు వంతుల మంది పార్టీ మారిపోయారు. ఫలితంగా వారు `విలీనం` అయినట్టుగా రాజ్యసభ చైర్మన్ ప్రకటి స్తారు. తద్వారా ఆప్ అధినేత జంపింగులపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. అయితే.. నైతికంగా బీజేపీని ఎండగట్ట వచ్చు. ప్రజల్లోకి కూడా వెళ్లి బీజేపీపై విమర్శలు చేయొచ్చు. కానీ, అధికారికంగా కానీ.. చట్ట సభల పరంగా కానీ.. కేజ్రీవాల్ ఏమీచేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదంతా పక్కా వ్యూహంతోనే బీజేపీ చేసిందన్న వాదన వినిపిస్తోంది.
జంపింగులు వీరే..
1) రాఘవ్ చద్దా
2) స్వాతి మాలివాల్
3) హర్భజన్ సింగ్
4) రాజీందర్ గుప్తా
5) విక్రమ్ సాహ్నీ
6) అశోక్ మిట్టల్ (ఇటీవలే ఈయనకు రాజ్యసభలో ఆప్ నేతగా పదవి ఇచ్చారు)
7) సందీప్ పాఠక్