నెల్లూరులో చెట్టును తీస్తే నీరు ఉప్పొంగింది

Update: 2015-11-27 04:22 GMT
ఏపీలో చిత్రవిచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  ఇప్పటికే కడప జిల్లాల్లో ఎలాంటి కారణం లేకుండా కొన్ని గ్రామాల్లో పెద్ద పెద్ద గోతులు ఏర్పడటం.. ఒక్కొక్క గోయ్యి 30 అడుగుల లోతు ఉండటం తెలిసిందే. ఇది ఏ ఒక్కసారో కాకుండా ఇప్పటికి పలుసార్లు చోటు చేసుకోవటం.. భూగర్భ శాస్త్రవేత్తలు వచ్చి పరీక్షలు జరుపుతున్నారే తప్పించి.. ఎందుకిలా అవుతుందో స్పష్టంగా చెప్పని పరిస్థితి. కడప జిల్లాల్లో భూమి కుంగి.. భారీ గోతులు ఏర్పడటానికి వెనుక కారణం ఏమిటో తెలీక టెన్షన్ పడిపోతుంటే.. నెల్లూరు జిల్లాలో తాజాగా మరో చిత్రమైన ఘటన చోటు చేసుకుంది.

నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలంలోని ఏకొల్లు గ్రామ శివారులో ఓ చెట్టు కింద భూమి నుంచి చిత్రమైన శబ్దాలు చోటు చేసుకున్నాయి. ఈ శబ్దాలు విన్నవారు భూకంపం వచ్చిందా? అన్న భయాందోళనలకు గురయ్యారు. ఈ శబ్ధాలు స్థానికులు భయపడగా.. కొందరు ధైర్యం చేసి.. శబ్దాలు వచ్చిన చోట ఉన్న చెట్టును తొలగించారు.

చెట్టును తొలగించిన వెంటనే ఒక్కసారిగా భూమి నుంచి నీరు ఉప్పొంగింది. దీంతో.. వారు భయాందోళనలకు గురయ్యారు. అయితే.. ఈ ప్రాంతాన్ని సందర్శించిన నిపుణులు చెబుతున్నదేమంటే.. చెట్టుకింద పుట్ట ఉందని.. దాన్లోకి నీరు చేరి.. అవి బయటకు వచ్చే సమయంలో ఒత్తిడికి లోనై శబ్దాలు వచ్చాయని తేల్చారు. ఒత్తిడి కారణంగా శబ్దాలు రావటం.. చెట్టును తొలగించటంతో పుట్టలో ఉన్న నీరు పైకి ఎగజిమ్మినట్లుగా భావిస్తున్నారు. ఒకటి తర్వాత ఒకటిగా బయటకు వస్తున్న ఈ చిత్రమైన ఘటనలు ఏపీలోని వివిధ ప్రాంతాల వారిని భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
Tags:    

Similar News