ఆస్ట్రేలియా లో డెల్టా బీభత్సం ... మళ్లీ ప్రారంభమైన 'లాక్ డౌన్'

Update: 2021-07-30 04:50 GMT
కరోనా వైరస్ డెల్టా వేరియంట్ విజృంభణ గురించి ఆస్ట్రేలియా కి చెందిన ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శరవేగంగా వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్‌ రకం కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఆస్ట్రేలియాలోని అన్ని ప్రాంతాల్లో కూడా కేసులు బయటపడుతున్నాయి. ఉత్తరాన ఉన్న క్వీన్స్‌ ల్యాండ్‌, పశ్చిమ ఆస్ట్రేలియాలలో కూడా డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒకేసారి కరోనా కేసులు నమోదు కావడం కొన్ని నెలల తర్వాత ఇప్పుడే కావడం గమనార్హం. కేసులు పెరుగుతుండటంతో దీనిపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల నాయకులతో ఆస్ట్రేలియా ప్రధాని సమావేశం కూడా నిర్వహించారు. డెల్టా వేరియంట్ దేశంలో రాబోయే రోజుల్లో దాదాపు 6 మిలియన్ల మందికి వ్యాపించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

డెల్టా వేరియంట్ విజృంభణ కారణంగా లాక్ డౌన్ ను మళ్లీ అమల్లోకి తీసుకువచ్చారు. అలాగే కరోనా వైరస్ ఆంక్షలు మరియు జరిమానాలను పొడిగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియా లో అతిపెద్ద రాష్ట్రమైన న్యూ సౌత్ వేల్స్ గురువారం కొత్తగా 239 కేసులు నమోదు అయ్యాయి. జూన్ మధ్యలో మొదలైన ఈ కరోనా డెల్టా వేరియంట్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. దీనితో కరోనా నియమాలని పాటించని వారికీ విధించే ఫైన్ ను కూడా భారీగా పెంచారు. గతంలో 200 ఆస్ట్రేలియన్ డాలర్లు ఉండగా దాన్ని తాజాగా 500 ఆస్ట్రేలియన్ డాలర్లుగా మార్చారు.

న్యూ సౌత్ వేల్స్ లో కరోనా డెల్టా వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం తో కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించే లాక్ డౌన్ ను ఆగస్టు 28 వరకు మరోసారి పొడిగించారు. కరోనా కట్టడి కోసం కనీసం తొమ్మిది వారాలపాటు లాక్ డౌన్ అమలు చేయబడుతుందని బెరెజిక్లియన్ ధృవీకరించడంతో ప్రయాణ ఆంక్షలు మరింత కఠినతరం చేయబడ్డాయి. జూన్ 26 న ఆంక్షలు ప్రారంభం అయ్యాయి. జూన్ మధ్య నుండి ఇప్పటి వరకు దాదాపు 3,000 కేసులు నమోదయ్యాయి. దీనితో రాజకీయ ప్రత్యర్థులు ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ అనేక విధాలుగా కరోనా మహమ్మారి ని నివారించడంలో విఫలమయ్యారని ఆరోపణలు చేశారు మరోవైపు, సిడ్నీ యొక్క లాక్ డౌన్ లో కొత్త నిబంధనలతో కఠినంగా అమలు చేస్తున్నారు. అలాగే ఒక ఇంటి నుండి ఏ కారణంతోనైనా కూడా మరో ఇంటికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా కఠిన ఆంక్షలు విధించారు. అయితే , ఒకే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంత మంది అయినా ఉండచ్చు. అలాగే ఎవరైనా కూడా పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి వీలు లేదు.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతుండడం, దాని వల్ల కేసులు పెరుగుతుండడంపై ప్రజలకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ దేశంలో కేవలం 11 శాతం మందికే వ్యాక్సిన్లు అందాయి. ధనిక దేశాలతో పోలిస్తే అత్యంత తక్కువ వ్యాక్సినేషన్ అది. దీనిపై ఆయన విచారం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ఏమీ పరుగు పందెం కాదని ఒకప్పుడు అన్న ఆయనే.. ఇప్పుడు దిగొచ్చారు. నేను విఫలమయ్యాను. ఈ ఏడాది ప్రారంభంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోలేకపోయాను. అందుకు క్షమాపణలు కోరుతున్నా. టీకా కార్యక్రమం ఇంత నెమ్మదిగా సాగుతున్నందుకు నేనే బాధ్యత తీసుకుంటున్నా. ఇప్పటికే ఎదురైన సవాళ్లన్నింటికీ నేనే బాధ్యుణ్ణి. కొన్ని అంశాలు మన నియంత్రణలో ఉన్నాయి.. మరికొన్ని లేవు అని ఆయన విచారం వ్యక్తం చేశారు. అందరికీ వ్యాక్సిన్ అందే వరకూ ఎవరికివారు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆంక్షలను తు.చ తప్పక పాటించాలని సూచించారు


Tags:    

Similar News