తండ్రీకొడుకుల లాకప్ డెత్ చేసిన ఎస్ఐ కరోనాతో మృతి

Update: 2020-08-11 11:50 GMT
కరోనాతో పోరాడుతున్న ఫ్రంట్ లైన్ ఉద్యోగుల్లో పోలీసులు ఒకరు. వారి సేవలు వెలకట్టలేనివి. అయితే ఆ మధ్య తమిళనాడులోని సాతంకుళం ప్రాంతంలో మొబైల్ షాపును క్లోజ్ చేయలేదని జూన్ 19న జయరాజ్, అతడి కుమారుడిపైన ఎస్ఐ పౌల్దురై కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకొని చితకబాదడంతో వారు లాకప్ డెత్ గా చనిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులపై చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేయడంతో కేసును సీబీఐకి అప్పగించారు.

ఈ కేసులో మొత్తం 10మంది పోలీసులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఎస్ఐ పౌల్దురై కూడా ఇందులో ఉన్నారు. ప్రధాన సూత్రధాని పౌల్దూరై అని తేలడంతో అరెస్ట్ చేసి మధురై సెంట్రల్ జైలుకు తరలించారు.

తాజాగా పౌల్దురై ఆరోగ్యం క్షీణించడంతో పరీక్షలు చేయగా కరోనా అని తేలింది. జైలు అధికారులు ఆస్పత్రికి తరలించి ఐసీయూలో ఉంచారు. కానీ సోమవారం ఎస్ఐ కరోనా తీవ్రత పెరిగి చనిపోయాడు.

దీంతో జయరాజ్ అతడి కుమారుడిని చంపిన ఎస్ఐకి తగిన శాస్తి జరిగిందని స్థానికులు, నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
Tags:    

Similar News