నిస్తేజంలో జాతీయ పార్టీ.. ఎవరు కాపాడెదరు..!

Update: 2020-02-18 14:30 GMT
స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరిలూదిన పార్టీ.. స్వతంత్ర భారతదేశాన్ని తొలి నుంచి 20014 దాక ఏలిన పార్టీ.. ఇప్పుడు చావు దెబ్బ తిన్నది. పార్టీ పరిస్థితి ఉందంటే.. ఉంది. అధ్యక్ష స్థానంలో కూర్చోవాల్సిన వ్యక్తి తనకు చేతకాదని ముందే చేతులెత్తేశాడు. ఇప్పుడు ఉన్న పెద్ద దిక్కు అనారోగ్యంతో సతమతమవుతున్నారు. కుటుంబాన్ని వదిలి ఇతరులకు పార్టీ పగ్గాలు ఇద్దామంటే అంత శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడు కనుచూపు మేరలో కూడా లేరు. ఈ పరిస్థితిలో ఆ పార్టీ నాయకత్వం లేక తీవ్రంగా నష్టపోతున్నది. దానికి ఢిల్లీ ఎన్నికలే నిదర్శనం.

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలు సీట్లు పంచుకున్నాయి.. కానీ కాంగ్రెస్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న ఢిల్లీలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మరి ఈశాన్య, ఉత్తర, దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని ఎన్నికలు వచ్చినా దాన్నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకు వెళ్లాల్సింది పోయి అసలు పట్టించుకోవడం లేదు. కనీసం ఫలితాలపై సమీక్ష నిర్వహించాల్సిన బాధ్యతను కూడా ఆ పార్టీ మరచిపోయింది.

70 స్థానాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ 62 గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. అయితే 8 స్థానాలు ఎందుకు కోల్పోయామని సమీక్ష చేసింది. కేవలం ఎనిమిది సీట్లేనా.. మిగతా చోట్ల ఎందుకు ఓడిపోయాం అనే దానిపై బీజేపీ సమీక్ష నిర్వహించింది. ఇక సున్నా స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఓటమిపై సమావేశం నిర్వహించలేదు. పశ్చాత్తాపం అనేది ఎక్కడా కనిపించలేదు. ఈ పతనావస్థకు చేరిన పార్టీని ఎవరూ కాపాడుతారో.

గతంలో నెహ్రూ, పటేల్, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ తదితర గొప్ప నాయకులను అందించిన ఆ పార్టీ ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు వదిలేయి.. కనీసం ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిని పక్కాగా నిర్ణయించడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితుల కారణంగా కాంగ్రెస్‌ అధికారంలో కొనసాగుతోంది కానీ వాస్తవంగా పార్టీకి పెద్ద ప్రయోజనం లేదు. 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ పరాజయం చెందడంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా ఆశ్చర్యం కలిగించింది. ఆయన తనకు చేతకాదని పార్టీ పగ్గాలు తల్లి సోనియాగాంధీకి అప్పగించారు. దీంతో సోనియాగాంధే పార్టీని నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వయసు మీదపడి, అనారోగ్యంతో సతమతమవుతున్నారు. అలాంటి ఆమె పార్టీని పరిగెత్తించాలంటే సాధ్యం కాదు. ఢిల్లీ ఎన్నికల్లోనే ప్రచారానికి రాలేకపోయారు.

ఇదే సమయంలో పార్టీలో వర్గపోరు బహిర్గతమవుతోంది. తాజాగా ఢిల్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పలువురు నాయకులు సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. ఓటమికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ పీసీసీ ఇన్‌ఛార్జ్ వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. దివంగత నేత, ఒకప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ హయాంలోనే కాంగ్రెస్‌ పతనం ప్రారంభమైందని సుభాష్‌ చోప్రా సంచలన ఆరోపణలు చేశారు. దీంతో అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పార్టీలో కొందరు వ్యక్తులు పనిగట్టుకుని తనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని కాంగ్రెస్‌ ఘోర పరాజయం వెనుక ఎవరున్నారో తనకు తెలుసంటూ ఏఐసీసీ ఢిల్లీ మాజీ ఇన్‌ఛార్జ్ పీసీ చాకో సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయాన్ని తానూ స్వాగతిస్తున్నట్టు ప్రకటించి ఆశ్చార్యినికి గురి చేశారు. అనంతరం ఢిల్లీ కాంగ్రెస్ మహిళా నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించే బాధ్యతను ప్రాంతీయపార్టీలకు అప్పగించారా..? అని ఆమె ప్రశ్నించారు. ఈ విధంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే పార్టీ ఎలా పటిష్టమయ్యేది.

ఎన్నికలంటే కాంగ్రెస్ అంతగా యావ లేదు. ఎన్నికలను ఉదాసీనంగా తీసుకుంటున్నారు.. ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపే ధ్యేయంగా భావించి వెళ్లితే ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే అంతర్గత కుమ్ములాటలతోనే ఓటర్ల మదిలో ఓ అభిప్రాయం ముద్ర పడుతుంది. ఆ ఫలితం చివరకు ఎన్నికలపై పడుతుంది. ఇది గమనించకుండా వర్గ పోరాటాలు, వ్యక్తిగత అజెండాతో వెళ్లితే ఎవరూ గెలవకుండా పోతున్నారు. ఇది అసలు కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడానికి కారణం. పైగా పార్టీని నడిపించే సత్తా ఉన్న నాయకుడు ఉంటే కొంత కలిసొచ్చే అవకాశం ఉంది.

ఇక భవిష్యత్ లో పశ్చిమబెంగాల్, బీహర్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్నాయి. మరి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి ఫలితాలు ఎదుర్కొంటుందో వేచి చూడాలి.
Tags:    

Similar News