అమెరికాలో చిత్తూరు జిల్లా మహిళ మృతి

Update: 2020-12-05 04:50 GMT
దేశం కాని దేశం పోయి అక్కడ ప్రవాస భారతీయులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడంటే అందరూ ఉంటారు. చెప్పుకోవడానికి.. ఓదార్చడానికి బోలెడు మంది ఉంటారు. కానీ భాష తెలియని ప్రాంతంలో జీవించడం చాలా కష్టం. అక్కడ ఎవరూ ఉండరు. ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. ఆ క్రమంలోనే ఓ చిత్తూరు మహిళ మృతి చెందడం కలకలం రేపింది.

తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన ప్రేమలత (32) అనే మహిళ అమెరికాలో మంగళవారం రాత్రి మృతిచెందింది. జిల్లాలో ఇది విషాదం నింపింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బందార్లపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు కుమార్తె ప్రేమలతకు.. అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లెకు చెందిన సుధాకర్ నాయుడుతో 2016లో వివాహమైంది. 2017లో సుధాకర్ దంపతులు అమెరికా వెళ్లారు. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు గీతాంష్ ఉన్నాడు.

ప్రేమలత మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. తమ కుమార్తెను సుధాకర్ హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తండ్రి, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె మృతదేహాన్ని పంపించడానికి అల్లుడు నిరాకరిస్తున్నాడని.. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని ప్రేమలత తల్లిదండ్రులు కలెక్టర్ భారత్ నారాయణ ను కోరారు.
Tags:    

Similar News