గ‌మ‌నికః ప్ర‌త్యేకంపై బాబు మాట మారింది

Update: 2016-05-19 09:57 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా విష‌యంలో తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టోన్ మారుతోంది. ఇన్నాళ్లు ప్ర‌త్యేక హోదా గురించి ప‌ట్టుబ‌ట్టిన బాబు మెల్లిగా దాన్ని స‌డ‌లిస్తున్నారు. బ‌దులుగా అభివృద్ధి మంత్రం జ‌పిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ప్ర‌త్యేక హోదాతోనే సమస్యలకు పరిష్కారం లభించదని అన్నారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి సాధించడానికి కేంద్రం చేయూతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో  కోరినట్టు  తెలిపారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ను అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేసే క్ర‌మంలో భాగంగా ఇప్పటికి 18 దఫాలు ఢిల్లీ వెళ్లానని చంద్ర‌బాబు చెప్పారు. రాజధాని నిర్మాణం - విశాఖ రైల్వే జోన్ - వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ - తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ ల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రధానిని కోరానన్నారు. రాష్ట్ర లోటు బడ్జెట్‌ ను పూడ్చాలని కోరానన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే జాతికే లాభమని ప్రధానికి వివరించానన్నారు.  రూ.16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ పూడ్చాలని కోరితే, ఇప్పటికి రూ.2,500 కోట్లు ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కు న్యాయమైన వాటా జలాలను ఇవ్వడానికి కేంద్రమే బాధ్యత వహించాలని, ఇరు రాష్ట్రాలు కేంద్రం వద్ద కూర్చుని జల సమస్యలను పరిష్కరించుకోవాలని తాను ఏనాడో పిలుపునిచ్చానని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర హక్కులను కాపాడడంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు.

కాపులకు రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చంద్ర‌బాబు అన్నారు. మంచికి మారుపేరైన తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమం ముసుగులో అరాచకం చెలరేగడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. రైలునే దగ్ధం చేయడం దారుణమని పనిలేని కొంతమంది ఇటువంటి సంఘటనలకు పురిగొల్పుతున్నారని, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడే అగ్రిగోల్డ్ వంటి సంస్థల ఆటలు సాగనిచ్చేదిలేదన్నారు. నదుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని - కృష్ణా - పెన్నా - వంశధార - నాగవళి నదులను అనుసంధానం చేస్తామన్నారు. ఎత్తిపోతల ద్వారా రెండు కోట్ల ఎకరాలకు సాగునీరంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 450 ఎత్తిపోతల పథకాలకు రూ. 450 కోట్లతో మరమ్మతులు చేస్తున్నామన్నారు. గోదావరి జిల్లాల రైతులు తనపై నమ్మకముంచి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
Tags:    

Similar News