అక్కడ ఇద్దరు చంద్రుళ్ల ఫోటోలు తీసేశారు

Update: 2015-10-06 03:32 GMT
ఢిల్లీలోని ఏపీ.. తెలంగాణ భవన్ లలో విచిత్రమైన వ్యవహారం చోటు చేసుకుంది. ఈ రెండు రాష్ట్రాలు వాడుకునే వీలున్న గురజాడ హాలులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలు ఉన్నాయి.

సోమవారం వరకు వాటికి ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఢిల్లీ లోగోను ఏపీ ముఖ్యమంత్రి ఆవిష్కరించాల్సి ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా తెలంగాణ సీఎం  కేసీఆర్ చిత్రపటాన్ని తొలగించారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ భవన్ అధికారి ఒకరు వచ్చి.. తెలంగాణ సీఎం చిత్రపటాన్ని యథాతధంగా ఉంచాలన్నారు. దీనికి ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయంటూ ఆంధ్రా భవన్ సిబ్బంది వ్యాఖ్యానించటంతో.. అయితే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో తీసేయాలన్న వాదన జరిగింది.

చివరకు తెలంగాణ సీఎం ఫోటోతో పాటు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోను కూడా తీసేశారు. చిత్రపటాల వ్యవహారం వివాదంగా మారుతుందని.. రాజకీయం అవుతుందన్న వాదన నడిచింది. చివరకు ఇరువురు ఫోటోలు తీసేసే పరిస్థితి. ఈ వ్యవహారం జరిగిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆ సమయంలో గోడకు ఆయన చిత్రపటం లేకుండా మీడియా సమావేశం జరగటం గమనార్హం. ఇరు రాష్ట్రాల్ని ప్రభావితం చేసే విషయంలో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకునే ముందు వెనకాముందు చూసుకోవాలి. అందుకు భిన్నంగా చేస్తే.. ఇలాంటి పరిస్థితులు ఏర్పడటమే కాదు.. అనవసర రాజకీయ ఉద్రిక్తతలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.
Tags:    

Similar News