2024 కల్లా అన్ని స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ : సీఎం జగన్

Update: 2021-10-11 10:37 GMT
రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ స్కూల్‌ కి  నిర్వహణ ఖర్చుల కింద రూ. లక్ష అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. స్కూల్‌ కు మరమ్మతులతో పాటు ఏ సమస్య వచ్చినా తీర్చుకునే అవకాశం ఉంటుందని, దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, అమ్మఒడి పథకం సహా అనేక అంశాలపై అధికారులతో సమీక్షించారు.  అమ్మఒడి పథకం పొందాలంటే 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధన కరోనా వల్ల అమలు చేయడం సాధ్యం కానందున..  వచ్చే విద్యా సంవత్సరం నుంచి పరిగణనలోకి తీసుకోవాలని జగన్ అధికారులను సూచించారు.  అమ్మ ఒడి పథకం స్ఫూర్తి కొనసాగాలని దిశానిర్దేశం చేశారు.  

అందరూ చదవుకునేలా  తల్లులను, పిల్లలను చైతన్యం చేయడానికి అమ్మ ఒడి పథకాన్ని తీసుకు వచ్చామన్నారు. రెండేళ్లుగా కోవిడ్‌ కారణంగా పాఠశాలలు సరిగ్గా నడవని పరిస్థితి ఏర్పడిందని.. అమ్మ ఒడి అమలుకు 75 శాతం హాజరు తప్పనిసరి అన్న నిబంధనను మనం పరిగణలోకి తీసుకోలేని పరిస్థితులు వచ్చాయన్నారు. ఈ ఏడాది కూడా జూన్‌ లో ప్రారంభం కావాల్సిన స్కూళ్లను ఆగస్టు 16 నుంచి ప్రారంభించామని, అందుకే  2022 నుంచి అమ్మ ఒడి పథకానికి హాజరుకు అనుసంధానం చేయాలన్నారు.  

విద్యార్థుల హాజరును పరిగణనలోకి తీసుకుని జూన్‌లో పిల్లల్ని స్కూల్‌ కు పంపే సమయంలో, విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అమ్మ ఒడిని అందించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అమ్మ ఒడి, విద్యాకానుక రెండూ కూడా పిల్లలు జూన్‌లో స్కూల్‌కి వచ్చేటప్పుడు ఇవ్వాలన్నారు.  అకడమిక్‌ ఇయర్‌ తో అమ్మ ఒడి అనుసంధానం కావాలన్నారు. ఇప్పటి వరకూ జనవరిలో అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారు. జనవరి తొమ్మిదో తేదీన తల్లుల బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ చేస్తున్నారు. సమీక్షలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇక జూన్ నంచి అమలు చేసే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు.

అయితే దీనిపై ఇంకా స్పష్టత లేదు.  విద్యాకానుకను ఆర్డర్ ను డిసెంబర్‌ కల్లా ఇవ్వాల్నారు. స్పోర్ట్స్‌ డ్రస్, షూలను  సీఎం జగన్ పరిశీలించారు. అన్ని స్కూళ్లకూ సీబీఎస్‌ ఈ అఫిలియేషన్‌ తీసుకొచ్చేదిశగా చర్యలు తీసుకోవాలని .. 2024 నాటికి పిల్లలు సీబీఎస్‌ ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి హైస్కూల్‌ కు కచ్చితంగా ప్లే గ్రౌండ్‌ ఉండాలని లేకపోతే భూ సేకరణచేసి ప్లే గ్రౌండ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేలా చూడాలన్నారు. ఈమేరకు ప్రణాళిక సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు.  

స్కూళ్ల పనితీరుపై ర్యాంకింగ్‌ లు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు.  ఇలాంటి ఏ మార్పులు తీసుకు వచ్చినా ముందుగా టీచర్లతో మాట్లాడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎలాంటి సంస్కరణలు, మార్పులు తీసుకురావాలనుకున్నా దానివెనుకున్న ఉద్దేశ్యాలను టీచర్లకు స్పష్టంగా చెప్పాలన్నారు. టీచర్లను తొలగించడానికో లేదా వారిని అభద్రతా భావానికి గురిచేయడానికో ఇలాంటి విధానాలు కావనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. స్కూళ్లను నడిపే విషయంలో, విద్యార్థులకు బోధన అందించే విషయంలో, నాణ్యతను పాటించే విషయంలో ఎక్కడ వెనుకబడి ఉన్నామనే విషయాన్ని తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ సోషల్‌ ఆడిటింగ్‌ ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేసారు. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులను మెరుగవుతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి...ఆగస్టులో పిల్లల హాజరు 73 శాతంగా ఉంది. సెప్టెంబరులో 82 శాతానికి పెరిగింది. అక్టోబరు నాటికి 85శాతం నమోదైందని అధికారుల తెలిపారు. ప్రభుత్వం పాఠశాలల్లో హాజరు ప్రస్తుతం 91శాతం హాజరు ఉందని నిర్ధారించారు.
Tags:    

Similar News