ఎమ్మెల్యే వర్సెస్ ఇన్ చార్జి.. అక్కడ రచ్చ!

Update: 2019-07-19 14:30 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నందికొట్కూరు లొల్లి కొనసాగుతూ ఉంది. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ చార్జిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఉన్నారు. అది ఎస్సీ రిజర్వ్ సీట్. ఎన్నికల ముందు ఆ టికెట్ ను ఆర్థర్ కు కేటాయించారు.

గత టర్మ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి ఆఖరి నిమిషంలో ఆర్థర్ కు టికెట్ కేటాయించారు జగన్ మోహన్ రెడ్డి. అక్కడ పార్టీ బాధ్యతలు అప్పటికే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి దక్కాయి.

ఆ నియోజకవర్గంలో ఓటు బ్యాంకు ప్రకారం మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ ఇన్ చార్జికి - ఎమ్మెల్యేకు మధ్యన రచ్చ మొదలైంది.

నియోజకవర్గంలో హవాను కొనసాగించే విషయంలో వారిద్దరి మధ్యన ప్రచ్చన్న యుద్ధం సాగుతోందని సమాచారం. ఎమ్మెల్యే తను కాబట్టి తన మాట చెల్లాలని ఆర్థర్ అంటున్నారట. పార్టీ ఇన్ చార్జి తను కాబట్టి నియోజకవర్గంలో తనదే హవా అని సిద్ధార్థ్ రెడ్డి అంటున్నాడని సమాచారం.

ఇప్పటికే ఈ విబేధాలు రచ్చకు ఎక్కాయి. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే వారిద్దరి మధ్యన విబేధాలు వార్తల్లోకి వచ్చాయి. అవి అలాగే కొనసాగుతూ ఉన్నాయి. ఈ అంశం మీద జగన్ మోహన్ రెడ్డి ఎప్పడు దృష్టి సారిస్తారనే అంశం ఆసక్తిదాయకంగా మారిందిప్పుడు.
Tags:    

Similar News