కాంగ్రెస్, టీఆర్ఎస్ వలసలపై బీజేపీ టార్గెట్

Update: 2020-12-08 09:30 GMT
దుబ్బాక, జీహెచ్ఎంసీలో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ ఇప్పుడు తెలంగాణలో పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. కాంగ్రెస్ పార్టీని మూడోస్థానానికి నెట్టి టీఆర్ఎస్ కు ప్రత్యామ్మాయశక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. వీలైనంత త్వరగా తెలంగాణలో బలపడాలని.. అంతటా బలోపేతం కావాలని ప్లాన్ చేస్తోంది.

మిషన్ -2023 లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది.  దీనిమీదే ఇప్పుడు కమలనాథులు తీవ్రంగా వ్యూహరచన చేస్తున్నారు. ప్రాంతాల వారీగా బలబలాలను బేరీజు వేసుకుంటున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీల్లోని అసంతృప్త, కీలక నేతలను బీజేపీలోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కోణంలో పార్టీల వారీగా... పక్కాగా జాబితాలను సిద్ధం చేసినట్టు తెలిసింది.

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ గెలిచిన స్థానాలు, గట్టిపోటీనిచ్చిన స్థానాలు, ప్రజలు బీజేపీపై ఆదరణ చూపిన ప్రాంతాల్లో మొదట పట్టు సాధించాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ లలోని అసంతృప్తులకు గాలం వేస్తున్నారు. ఇప్పటికే పలువురు చేరగా.. కాంగ్రెస్ నేత విజయశాంతి చేరికతో పార్టీ బలోపేతమైంది.  ఈ క్రమంలోనే బీజేపీ వైపు పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించాలని భావిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేస్తూ వలసల వ్యూహానికి పదును పెడుతున్నారు.

   కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారంటూ గతంలోనే ప్రచారం జరిగింది. మరోవైపు నాగార్జునసాగర్‌కు ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి కుటుంబంతో బీజేపీ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రితో బీజేపీ ముఖ్యనేత ఒకరు ఇప్పటికే చర్చలు జరిపారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్రయాదవ్‌ ఇటీవల స్వయంగా భేటీ అయ్యారు.  

ఇలా చేరికల వ్యూహంతో బలపడి తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించాలని బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది వేచిచూడాలి.
Tags:    

Similar News