నేడు విఠ‌ల్‌.. రేపు మ‌ల్ల‌న్న‌.. బీజేపీలో నూత‌నోత్సాహం

Update: 2021-12-06 09:09 GMT
తెలంగాణ‌లో బీజేపీ జోరు మీదుంది. గ‌తేడాది రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఎంపికైన బండి సంజ‌య్ పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఇక ఇటీవ‌ల టీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీ త‌ర‌పున హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఈట‌ల రాజేంద‌ర్ గెల‌వ‌డంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నిండింది. ఇప్పుడా ఉత్సాహం మ‌రింత పెర‌గ‌నుంది.

రాష్ట్ర ప్ర‌జ‌లకు ప‌రిచ‌య‌మైన ఉద్య‌మ నాయ‌కులుగా పేరు తెచ్చుకున్న చింత‌ల‌గ‌ట్టు విఠ‌ల్ సోమ‌వారం, తీన్మార్ మ‌ల్ల‌న్న మంగ‌ళ‌వారం బీజేపీలో చేరుతున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో అధికారం ద‌క్కించుకోవాల‌నే ల‌క్ష్యంతో సాగుతున్న బీజేపీ మ‌రింత బ‌లోపేతం కానుంది.

తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్య‌క్షుడు విఠ‌ల్‌.. తెలంగాణ ఐకాస ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, కో- ఛైర్మ‌న్‌గా ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించారు. రాష్ట్రం ఏర్ప‌డ్డ త‌ర్వాత టీఎస్‌పీఎస్సీ స‌భ్యుడిగా నియ‌మితులైన ఆయ‌న ప‌ద‌వీ కాలం ఏడాది క్రితం ముగిసింది. ఆయ‌న‌కు టీఎస్పీఎస్సీ ఛైర్మ‌న్ లేదా ఏదైనా కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కుతుంద‌నే ప్ర‌చారం జ‌రిగినా అది సాధ్యం కాలేదు.

మ‌రోవైపు కేసీఆర్ వైఖ‌రిపై టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఆయ‌న అసంతృప్తితో ఉన్నారు. ఉద్యోగాల నియామ‌కం ప‌ట్ల ప్ర‌భుత్వ తీరును వ్య‌తిరేకిస్తున్నారు. పాల‌మూరు - రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్ మార్చ‌డాన్ని త‌ప్పుప‌ట్టారు.

ఉద్యోగాల నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసే విష‌యంపై చర్చించేందుకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యార‌ని తెలిసింది. ఆ స‌మ‌యంలోనే బీజేపీ నేత‌లు ఆయ‌న్ని పార్టీలోకి ఆహ్వానించ‌డంతో విఠ‌ల్ కాషాయ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు.

1996 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డే వ‌ర‌కూ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం జ‌రిగిన ప్ర‌తి ఉద్య‌మంలోనూ త‌న‌దైన పాత్ర పోషించిన విఠ‌ల్‌ను చేర్చుకోవ‌డం బీజేపీకి లాభం చేకూర్చేదే. ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్‌, కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ, ప్రొఫెస‌ర్ కొదండ‌రాం త‌దిత‌రుల‌తో క‌లిసి ప‌నిచేసిన విఠ‌ల్‌కు రాష్ట్రంలోని ప‌రిస్థితులు రాజ‌కీయాల‌పై గొప్ప అవ‌గాహ‌న ఉంది.

ఉద్యోగుల హ‌క్కుల కోసం కూడా ఆయ‌న పోరాడారు. అయితే ఆయ‌న రావాల్సిన పింఛ‌న్ల‌ను ప్ర‌భుత్వం నిలిపివేసిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడు బీజేపీలో చేరి కేసీఆర్‌పై పోరాటం చేసేందుకు విఠ‌ల్ సిద్ధ‌మ‌య్యారు.

మ‌రోవైపు చింత‌పండు న‌వీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న మంగ‌ళ‌వారం కాషాయ కండువా క‌ప్పుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కేసీఆర్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డ‌మే ధ్యేయంగా పెట్టుకున్న ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ మ‌ల్ల‌న్న జైలుకు కూడా వెళ్లి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. త‌న మాట‌ల‌తో కేసీఆర్ ప‌నితీరు ఎండ‌గ‌డుతున్న మ‌ల్ల‌న్న‌కు ప్ర‌జ‌ల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఓట‌మి ఎదురైన‌ప్ప‌టికీ అంచ‌నాల‌కు మించి ఓట్లు వ‌చ్చాయి. రాష్ట్రంలో కేసీఆర్‌ను గ‌ద్దె దించేందుకు ముందుకు సాగుతున్న బీజేపీ.. ఇప్పుడు ఈ నాయ‌కుల చేరిక‌తో మ‌రింత ఉత్సాహంతో ప‌నిచేసే అవ‌కాశం ఉంది. ప్ర‌జ‌ల్లో పేరున్న‌.. అభిమానం ఉన్న నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకోవ‌డం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మెరుగ్గా స‌న్న‌ద్ధ‌మ‌వాల‌ని చూస్తోంది.


Tags:    

Similar News