భూమాకి ఆర్థిక కష్టాలు..?

Update: 2017-01-23 05:49 GMT
కర్నూలు జిల్లాలోబలమైన ప్రజాదరణ కలిగిన అతికొద్ది మంది నేతల్లో భూమా నాగిరెడ్డిగా చెప్పాలి. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో ఆయనకు ధీటుగా నిలచే నాయకుడు ప్రస్తుతానికైతే లేరని చెప్పాలి. విధానాల పరంగా.. వ్యవహారశైలి పరంగా పలు ఆరోపణలు.. విమర్శలు ఉన్నప్పటికీ.. బలమైన వ్యక్తిగత ఛరిష్మా భూమా సొంతంగా చెప్పాలి.

ప్రజాభిమానంతో పాటు.. ఆర్థికంగా బలమైన నేతగా పేరొందిన భూమాకు ఆర్థిక కష్టాలంటే అవాక్కు అయ్యే పరిస్థితి. అయితే.. తాను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నానంటూ భూమానే స్వయంగా ఒక టీవీ ఛానల్లో చెప్పుకోవటం ఆసక్తికరంగా మారింది. కర్నూలు జిల్లాతోపాటు.. హైదరాబాద్.. బెంగళూరుల్లో వందల కోట్ల విలువైనభూములు.. ఆస్తులు ఉన్నట్లుగా పేరున్న భూమాకు ఆర్థికకష్టాలా? అన్న ప్రశ్నను ఆయన ముందు ఉంచితే.. తాను ఆర్థికకష్టాల్లో ఉన్నానని ఆయన ఒకటికి రెండుసార్లు చెప్పటం గమనార్హం.

అయితే.. ఆర్థిక కష్టాలకు కారణాలు చెప్పనప్పటికీ.. తాను నిజాయితీగా ఉండటమే కారణంగా చెప్పుకున్నారు. తనకూ డబ్బులు సంపాదించాలన్న ఆశ ఉందన్న భూమా.. తాను మంత్రి పదవి కోసం ఆరాటపడటం లేదన్నారు. జగన్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరే సమయంలో మంత్రి పదవికి సంబంధించిన చర్చ చంద్రబాబుతో రాలేదని స్పష్టం చేశారు. తాను మంత్రి పదవి వచ్చినా.. రాకున్నా తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అవుతానని చెప్పిన భూమా మరోఆసక్తికర వ్యాఖ్య చేశారు. తాను ఉంటే తెలుగుదేశం పార్టీలో ఉంటానని.. లేకుండా రాజకీయ సన్యాసం తీసుకుంటానే కానీ వేరే పార్టీలో చేరే ఆలోచన తనకు లేదని తేల్చి చెప్పారు. దీర్ఘ కాలం రాజకీయాల్లోఉండి.. ఎమ్మెల్యే పదవుల్లో ఉన్నప్పటికీ..తాను సంపాదించిందేమీ లేదని చెప్పిన భూమా మాటలు ఆసక్తికరంగా మారాయనే చెప్పాలి. ఆర్థికంగా తిరుగులేని అతి కొద్ది మంది నేతల్లో ఒకరైన భూమాకు ఆర్థిక కష్టాలంటే.. కుబేరుడికి పేదరికం వచ్చినట్లేనన్న విమర్శల్ని ఆయన ప్రత్యర్థులు చేస్తుండటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News