శిరోముండనం బాధితుడు వరప్రసాద్ అదృశ్యం ...

Update: 2021-02-05 09:40 GMT
ఏపీలో సంచలనం రేపిన శిరోముండనం బాధితుడు ప్రసాద్ అదృశ్యమయ్యాడు. నిన్నటి నుంచి కనిపించడం లేదని వరప్రసాద్ భార్య ఐశ్వర్య తూర్పుగోదావరిలోని సీతానగరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతేడాది జూలై 18వ తేదీన మునికూడలి, కటావరం వద్ద ఇసుక రేపు వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రశ్నించిన వరప్రసాద్‌ కు పోలీసు స్టేషన్ ‌లో ఎస్సై ఫిరోజ్ శిరోముండనం చేయించారు.

ఈ విషయం అప్పట్లో దుమారం రేపింది. రాష్ట్రపతి కార్యాలయం వరకు విషయం చేరడంతో కలకలం రేపింది. సీబీఐ విచారణ కూడా జరుగుతోంది. తనకు శిరోముండనం చేయించిన వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ ఇదివరకు వరప్రసాద్ నిరసన దీక్ష కూడా చేపట్టారు. కానీ కేసు మాత్రం పురోగతి సాధించడం లేదు. కేసు పురోగతి సాధించకపోవడంతో వరప్రసాద్ మనస్తాపంతో ఉన్నారు. తనకు న్యాయం జరగదని భావిస్తున్నారు. శిరోముండనం గురించి వేధిస్తున్నారని చెప్పి వాపోయేవాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మరోవైపు  దళిత యువకుడికి గుండు గీయించి అవమానించిన కేసులో దోషులను ఇప్పటికీ అరెస్టు చేయలేదని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు అదృశ్యమైన ఘటనలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

ప్రసాద్ తండ్రి మాట్లాడుతూ .. బుధవారం ఇంటికొచ్చి అన్నం తిని, టూ వీలర్ ఇంటి వద్దే పెట్టి వెళ్లిపోయాడని చెప్పారు. అతను కనిపించకపోవడంతో అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. అతను పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ కూడా కూడా ఫైల్ చేశాడని తెలుస్తోంది. టీడీపీ వార్డు మెంబర్ల నామినేషన్‌ కార్యక్రమంలో వర ప్రసాద్ పాల్గొన్నారు. ఇంటికి వచ్చి అన్నం తింటూ తనకు జరిగిన, జరుగుతున్న అవమానాలు గుర్తుచేసుకున్నాడని తండ్రి గంగరాజు తెలిపారు. తర్వాత సెల్‌ఫోన్‌, మోటార్‌ సైకిల్‌ ఇంటి వద్దే వదిలివెళ్లిపోయాడని తెలిపారు.

Tags:    

Similar News